153 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అంబటి రాయుడు బ్యాటింగ్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. చివరకు ఓ ఆటగాడు ఆ స్థానంలో తెలివిగా ఆడుతున్నాడని అన్నాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్ వరకు మేం అతడికి మద్దతుగా నిలవాల్సి ఉంది. ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటూ రాయుడు ముందుకు సాగుతున్నాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.
ఖలీల్ అహ్మద్ చక్కగా బౌలింగ్ చేశాడు
ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ తాము ఆధిపత్యాన్ని ప్రదర్శించామని కోహ్లీ తెలిపాడు. ఖలీల్ అహ్మద్ చక్కగా బౌలింగ్ చేశాడని, బంతిని రెండువైపులా స్వింగ్ చేశాడని కోహ్లీ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ సైతం అంబటి రాయుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
అంబటి రాయుడిపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం
వరల్డ్కప్ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న సందేహాలను రాయుడు తన సెంచరీతో తీర్చేశాడని రోహిత్ శర్మ అన్నాడు. ‘‘రాయుడు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానానికి సంబంధించి అన్ని సమస్యలనూ అతడు పరిష్కరించాడు. ఇక ప్రపంచకప్ వరకు నంబర్-4పై చర్చ ఉండదని అనుకుంటున్నా" అని అన్నాడు.
ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్ చేశాడు
"రాయుడు గొప్పగా బ్యాటింగ్ చేశాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో అతడు నిలబడ్డాడు. సత్తా చాటుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాక... ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్ చేశాడు. స్వేచ్ఛగా ఆడాడు. మాకు చాలా రోజులుగా రాయుడు తెలుసు. అతడి ప్రతిభ గురించీ తెలుసు" అని రోహిత్ శర్మ తెలిపాడు.