విశాఖ వేదికగా తొలి టీ20
ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్కి భారత జట్టులో ఓ కొత్త కుర్రాడు చేరాడు. పంజాబ్కు చెందిన 21 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను టీ20 సిరీస్కు ఎంపికచేశారు. ఆసీస్తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్కు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మార్కండేకు జట్టులో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఎవరీ మయాంక్ మార్కండే అన్న ప్రశ్న సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతోంది.
అందరి దృష్టిని ఆకర్షించిన మార్కండే
జూనియర్ స్థాయి నుంచే మార్కండే బౌలింగ్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్కు చెందిన మయాంక్ మార్కండే 2013-14 సీజన్లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో 18.24 యావరేజితో మొత్తం 29 వికెట్లు తీశాడు. అండర్-16 జట్టు తరుపున కేవలం 7 మ్యాచ్ల్లోనే మార్కండే ఈ వికెట్లను పడగొట్టడం విశేషం.
ఫాస్ట్ బౌలర్గా కెరీర్ను ప్రారంభించిన మార్కండే
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కండే తన కెరీర్ను ఫాస్ట్ బౌలర్గా ప్రారంభించాడు. ఆ తర్వాత తన కోచ్ సూచన మేరకు లెగ్ స్పిన్నర్గా మారాడు. లెగ్ స్పిన్లో మార్కండే వెపన్ ఏంటంటే గూగ్లీ. విజయ్ హాజారే టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 7న హర్యానాతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
6 వికెట్లు తీసి ఔరా అనిపించిన మార్కండే
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోఅడుగుపెట్టిన ఏడాదే హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్ లాడిన మార్కండే ఇప్పటివరకు 10 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ తరుపున లిస్ట్-ఏ క్రికెట్లో 2017-18 సీజన్లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లాడిన మార్కండే మొత్తం ఐదు వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది మొత్తం 14 మ్యాచ్లాడిన మార్కండే 15 వికెట్లు తీశాడు. దీంతో ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ముంబై ఫ్రాంఛైజీ మార్కండేను తన వద్ద అట్టిపెట్టుకుంది. మే చివరి వారంలో వన్డే వరల్డ్కప్ ప్రారంభమవనున్న నేపథ్యంలో కొత్తవాళ్లను తీసుకోకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావించారు.
రెండు టీ20ల సిరిస్కు మార్కండేను ఎంపిక చేసిన బీసీసీఐ
అయితే, ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టీ20ల సిరిస్కు మార్కండేను ఎంపిక చేసి బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టీమిండియాలో స్థానం సంపాదించడం పట్ల మార్కండే హర్షం వ్యక్తం చేశాడు. తన కల నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇంత త్వరగా టీమిండియాలో స్థానం లభిస్తుందని అనుకోలేదని ఆనందంతో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరిస్కు జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మయాంక్ మార్కండే