
హైదరాబాద్: నిజంగా నమ్మితీరాల్సిందే! అండర్-19 మ్యాచ్లో భాగంగా నాగాలాండ్కు చెందిన మహిళల జట్టు 2 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ రెండు పరుగుల్లో ఒక పరుగు ఎగస్ట్రా. అంటే మొత్తం 11మంది కలిపి చేసింది ఒక్క పరుగే. శుక్రవారం గుంటూరులోని జేకెసీ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదిక అయింది. అండర్-19 సూపర్ లీగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం నాగాలాండ్-కేరళకు చెందిన జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ మహిళల జట్టు క్రికెట్లోనే కనివినీ ఎరుగని రీతిలో 2 పరుగులు చేసిన ఆలౌటైంది. 5.2 ఓవర్లలో జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద నాగాలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 7.4వ ఓవర్లో జట్టు స్కోరు రెండు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇక్కట్నుంచి వికెట్ల పతనం కొనసాగింది.
ఒకరు తర్వాత ఒకరు క్రీజులోకి వచ్చి వెళ్తున్నారే తప్ప పరుగులు చేయడంలో విఫలం అయ్యారు. 50 ఓవర్లు ఆడాల్సిన నాగాలాండ్.. కేరళ బౌలర్ల ధాటికి 17 ఓవర్లలో రెండు పరుగులకే ఆలౌటైంది. అనంతరం 3 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు 0.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
నాగాలాండ్ బౌలర్ దీపిక తొలి బంతిని వేసింది. అది కాస్త వైడ్. ఆ బంతిని ఎదుర్కొన్న అన్సు దానిని ఫోర్గా మలిచింది. దీంతో కేరళ జట్టు విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఏ స్థాయిలోనైనా అత్యంత వేగంగా చేధించిన మ్యాచ్ ఇదే అని, అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. 17 ఓవర్లపాటు జరిగిన మ్యాచ్లో నాగాలాండ్ బ్యాట్స్ ఉమెన్ కనీస పరుగులు చేయలేకపోయారు. వారు కనీసం 40 పరుగులైనా సాధిస్తారని తాము భావించామని, కానీ వారు రెండు పరుగులకే ఆలౌట్ అయ్యారని కేరళ కోచ్ సుమన్శర్మ చెప్పారు.

కేరళ బౌలర్లు ఆ రెండు పరుగులిచ్చారిలా:
Aleena Surendran 3-2-2-0
Sourabhya P 6-6-0-2
Minnu Mani 4-4-0-4
Sandra Suren 2-2-0-1
Biby Sebastin 2-2-0-1
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.