హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన కెప్టెన్సీపై సందేహం వ్యక్తం చేయడంతోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అలెస్టర్ కుక్ తెలిపాడు. నిజానికి ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరగనున్న యాషెస్ సిరీస్తో ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని కుక్ భావించాడు. అయితే భారత్ చేతిలో 4-0తో సిరిస్ను కోల్పోవడంతో కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
'2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను డ్రా చేసుకోవడంతో నా కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆపై బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవడం, ఆ వెంటనే ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ చేతిలో 4-0తో ఘోర ఓటమి నన్ను అసహనానికి గురిచేశాయి' అని అన్నాడు.
'సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను అందించాను. ఆపై అదే జోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్లలో ఘనవిజయాలు సాధించినా బోర్డు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. గతేడాది పాక్తో సిరీస్ డ్రా చేసుకోవడం ఎంతగానో బాధించింది. జట్టు సమష్టిగా వైఫల్యం చెందినా ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది' అని కుక్ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్కు రెండు యాషెస్ సిరీస్లు అందించానని, మరో సిరీస్ వరకు కెప్టెన్ విజయాన్ని అందించాలని భావించానని కుక్ తెలిపాడు. అయితే బోర్డుతనపై నమ్మకం కోల్పోవడంతో కెప్టెన్సీని వీడ్కోలు పలకాలనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నానని కుక్ చెప్పుకొచ్చాడు.
2012లో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్గా ఎంపికైన అలెస్టర్ కుక్ 59 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ చేతిలో ఘోర ఓటమి అనంతరం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకోగానే బోర్డు కుక్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది. కుక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జో రూట్ కెప్టెన్ అయ్యాడు. ఇదిలా ఉంటే 2010-14 మధ్య కాలంలో 69 వన్డేలకు కుక్ కెప్టెన్గా వ్యవహరించాడు.