గత కొంతకాలంగా టెస్టులలో నిలకడగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్మెన్ అజింక్య రహానే అరుదైన ఘనత అందుకున్నాడు. ఇంగ్లీష్ కౌంటిల్లో భాగంగా హాంప్షైర్, నాటింగ్హమ్షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రహానే హాంప్షైర్ జట్టుకు ఆడుతూ సెంచరీ (197 బంతుల్లో 119) చేసాడు. దీంతో ఆడిన తొలి కౌంటీ మ్యాచ్లోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రహానే నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
రహానే కంటే ముందు పీయూష్ చావ్లా (2009), మురళి విజయ్ (2018)లు ఆడిన తొలి కౌంటీ మ్యాచ్లోనే సెంచరీలు చేశారు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రహానే తన సెంచరీతో ఆదుకున్నాడు. మూడో వికెట్ కు ఏకంగా 257 పరుగుల భాగస్వామ్యం అందించాడు. రహానే మొదటి ఇన్నింగ్స్లో 10 పరుగులే చేసినా.. రెండవ ఇన్నింగ్స్లో మాత్రం సెంచరీ చేసాడు.
గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పరుగులు చేయలేక ఇబ్బందిపడుతున్న రహానే ప్రపంచకప్ 2019 భారత జట్టులో చోటు దక్కించుకోలేదు. ఐపీఎల్-12 సీజన్లో కూడా అంతగా రాణించలేదు. పేలవ కెప్టెన్సీతో లీగ్ మధ్యలోనే తన సారధ్య బాధ్యతలను కూడా కోల్పోయాడు. అయితే కౌంటీల్లో మాత్రం సత్తా చాటాడు.
టీమిండియా తరపున 56 టెస్టులాడిన రహానే 40.55 సగటుతో 3,488 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే 90 వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 24 అర్ధసెంచరీలు ఉన్నాయి.