రహానే కెప్టెన్సీ సూపర్..
మెల్బోర్న్లో అద్భుత విజయాన్నందుకొని సిరీస్ లెక్క సరిచేసింది. ఆ తర్వాత సిడ్నీ గడ్డపై అద్వితీయ పోరాటంతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం ఆసీస్కు అచ్చొచ్చిన గబ్బాలోను గర్జించి మ్యాచ్తో పాటు సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ విజయాల్లో సారథిగా రహానేది కీలక పాత్ర. మెల్బోర్న్లో సూపర్ సెంచరీతో అండగా నిలిచిన కెప్టెన్.. సిడ్నీలో తన ఫీల్డింగ్ ప్లేస్మెంట్, బ్యాటింగ్ ఆర్డర్ వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైనా.. యువ ఆటగాళ్లతో మ్యాచ్లను గెలిపించాడు. తన కూల్ కెప్టెన్సీతో ధోనీని తలిపించాడు.
|
ఓటమెరుగని నాయకుడు..
ఓటమెరుగని నాయకుడిగా రహానే నిలిచాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో భారత్కు సారథ్యం వహించిన రహానే.. నాలుగింటిలో విజయాన్నందించి ఒక మ్యాచ్ను డ్రా చేశాడు. ఈ సిరీస్కు ముందు రెండు మ్యాచ్ల్లో జట్టును నడిపించిన రహానే రెండింటిలో విజయాన్నందించాడు. ఇక ఈ సిరీస్లో అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో జట్టు బాధ్యతలు అందుకున్న రహానే.. అద్వీతియ ఆటతో విజయాలు అందించాడు. గాయాలతో ఒక్కో ప్లేయర్ దూరమైనా.. పట్టు వదలకుండా జట్టును ముందుకు నడిపించాడు.
|
కోహ్లీ తప్పుకో..
దాంతో కొందరు అభిమానులు రహానేనే కెప్టెన్గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఖరి టెస్ట్ విజయానంతరం ట్విటర్ వేదికగా రహానే కెప్టెన్సీ కొనియాడుతూ.. టెస్ట్ల్లో అతన్నే కొనసాగించాలని కోరుతున్నారు. అంతేకాకుండా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీకి సూచిస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే కోహ్లీ వ్యక్తిగతంగా రాణిస్తాడని పేర్కొంటున్నారు. కనీసం టెస్ట్ల్లోనైనా రహానేను కెప్టెన్గా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు..
ఇక కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పుకోమనడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమైంది. ముఖ్యంగా ఐపీఎల్ టైమ్లో ఈ వాదన బాగా వినపడుతుంది. కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ ఒక్క టైటిల్ గెలవకపోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదు సార్లు చాంపియన్గా నిలిచింది. దాంతో రోహిత్కు పరిమిత ఓవర్ల పగ్గాలు అందించాలని గౌతమ్ గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లు సూచించారు. అయితే ఐపీఎల్ ఫలితాల ద్వారా సారథిని మార్చడం సరైంది కాదని, కోహ్లీ సారథ్యంలో భారత్ బాగానే రాణిస్తుందని వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్లు గట్టిగానే కౌంటరిచ్చారు.