ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ సంచలనాలకు తెర తీసింది. ఏకంగా పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ తో కాంట్రాక్ట్ ను కుదుర్చుకుంది. దీని విలువ 2.34 కోట్ల రూపాయలు. ఇంకొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ యాజమాన్యం పాకిస్తాన్ క్రికెటర్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ పాకిస్తాన్ క్రికెటర్.. అబ్రార్ అహ్మద్. స్టార్ లెగ్ స్పిన్నర్. అతన్ని 1,90,000 పౌండ్లతో కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్. భారత కరెన్సీలో దీని విలువ 2.34 కోట్ల రూపాయలు. ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ స్వయంగా అతన్ని జట్టులోకి తీసుకుంది. అతని ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకుని, భారీ మొత్తాన్ని వెచ్చించడానికీ వెనుకాడలేదు.

ఈ కాంట్రాక్ట్ ప్రకారం- అబ్రార్ అహ్మద్.. సన్రైజర్స్ లీడ్స్ తరఫున ఆడాల్సి ఉంటుంది. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ కోసం అతన్ని జట్టులో వినియోగించుకుంటుంది. హండ్రెడ్ లీగ్స్ కోసం ప్రస్తుతం మెగా వేలం పాట కొనసాగుతోంది. కావ్యా మారన్ స్వయంగా ఇందులో పాల్గొన్నారు. సన్ రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ దీనికి హాజరయ్యారు.
నిజానికి పాకిస్తాన్ ఆటగాళ్లను ఎవరినీ కూడా ఐపీఎల్ టోర్నమెంట్ కోసం తీసుకోకూడదు. ఈ నిబంధన హండ్రెడ్ లీగ్స్ కు వర్తించదు. అందుకే కావ్యా మారన్ ఎటువంటి భేషజాలకూ పోకుండా అబ్రార్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది. ప్రపంచ టీ20 లీగ్లలో పాక్ ఆటగాళ్లను తీసుకోకూడనే సంప్రదాయానికి ఆమె తెరదించారు.
27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ పాకిస్థాన్ తరపున 46 టెస్టులు, 28 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఇటీవల జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్లో శ్రీలంకతో జరిగిన చివరి సూపర్ 8 దశ మ్యాచ్లో 3 వికెట్లకు 23 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతనికి ఉంది. యూరప్లో టీ20 లీగ్లో ఆడటం ఇదే తొలిసారి. అతని భాగస్వామ్యం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.