ముంబై: అద్భుతమై ఇన్నింగ్స్తో బ్రిస్బేన్ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్పై టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. పంత్ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే.. ప్రత్యర్థి జట్టు చేతిలో ఉన్న మ్యాచ్ను అయినా సరే ఒంటిచేత్తో మనవైపు లాక్కొస్తాడన్నాడు. ఫలితం ఏదైనా కానివ్వండి.. యువ ఆటగాళ్లకు అండగా నిలబడాలని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపై మట్టికరిపించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రహానే సారథిగా తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.
ఆసీస్ టెస్టు సిరీస్లో అవలంబించిన వ్యూహాలను అజింక్య రహానే తాజాగా ఓ జాతీయ మీడియాతో పంచుకున్నాడు. 'అడిలైడ్ టెస్టు తర్వాత అంతా కూర్చుని చర్చించుకున్నాం. ముందురోజు ఏం జరిగిందన్న విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. ఊరికే అదే తలచుకుంటే కచ్చితంగా ఒత్తిడిలో కూరుకుపోతాం. సమిష్టిగా ఉండాలి, పరస్పర సహకారంతో ముందుకు సాగాలి, సానుకూల దృక్పథం అలవరచుకోవాలి, క్రీడాస్ఫూర్తితో ముందుకు పోవాలి మేం అవలంబించిన వ్యూహం ఇదే. ఫలితం ఏదైనా కానివ్వండి యువ ఆటగాళ్లకు అండగా నిలబడాలి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలగాలనుకున్నాం' అని జింక్స్ తెలిపాడు.
'ఎలా ఆడాలన్న విషయం గురించి పంత్కు బాగా తెలుసు. సిడ్నీ స్ట్రాటజీనే గబ్బాలో కూడా అవలంబించాడు. అయితే 97 పరుగుల వద్ద అవుట్ కావడంతో నిరాశ చెందాడు. కానీ వెంటనే తేరుకుని గబ్బాలో అదే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. తన ఆట ఎలా ఉంటుందో చూపించాడు. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో సెంచరీలు చేసిన పంత్.. మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి జట్టు చేతిలో ఉన్న మ్యాచ్ను అయినా సరే ఒంటిచేత్తో మనవైపు లాక్కొస్తాడు. అదీ అతడి సత్తా. తను ఫాం కొనసాగిస్తే ఎంతో బాగుంటుంది' అని రహానే అన్నాడు.
టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు ఆటను బాయ్కట్ చేసే అవకాశం టీమిండియాకు ఇచ్చినా దానికి రహానే అంగీకరించలేదు. దీంతో రహానే తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ 97 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. ఒత్తిడి అధిగమించి జట్టు మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాలుగో టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి, అద్భుత ఇన్నింగ్స్తో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే అతడిని ఎందుకు తీసుకోలేదు: మైకేల్ వాన్ ఫైర్