Mohammed Siraj episode in Sydney test: సిరాజ్ విషయంలో అంత ఖండకావరమా..? అసలు నిజాలు వెల్లడించిన రహానే

2020-21లో ఆస్ట్రేలియాలో భారత్ 2-1 టెస్ట్ సిరీస్ గెలవడం టీమిండియా క్రికెట్ చరిత్రలో ప్రధాన మైలురాళ్లలో ఒకటి. ఇది కేవలం సిరీస్ గెలవడం మాత్రమే కాదు. అజింక్యా రహానే నేతృత్వంలోని టీమిండియా పడిలేచిన కెరటంలా అద్భుతంగా పునరాగమనం చేయడాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత.. కోహ్లీ తన భార్య డెలివరీ కోసం టీమిండియాకు వచ్చాడు. ఇక కోహ్లీ స్థానంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్, ఆ తర్వాత సిడ్నీలో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది. ఇకపోతే పలువురు సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ బ్రిస్బేన్లోని గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించి చరిత్రపుటల్లో నిలిచే విజయాన్ని అందుకుంది.

సిరాజ్ను గలీజ్ మాటలు అంటూ..
ఇకపోతే మూడో టెస్టు జరిగిన సిడ్నీ గ్రౌండ్లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను స్టేడియంలోని ప్రేక్షకుల్లో ఒక వర్గం జాత్యహంకార దూషణలు చేశారు. ఆ టెస్టులో మూడో రోజు సిరాజ్ను ప్రేక్షకులు చింపాంజీ, తదితర గలీజ్ మాటలు అన్నారు. ఇక ఆ రోజు ఆట ముగిసిన తర్వాత సిరాజ్ ఆ విషయాన్ని భారత జట్టు మేనేజ్మెంట్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇక టీమిండియా మేనేజ్ మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఇక నాలుగో రోజు మార్నింగ్ సెషన్లో కూడా సిరాజ్ పట్ల ఉద్దేశపూర్వకంగా స్టాండ్స్ ఉన్న కొందరు ప్రేక్షకులు బూతులు తిట్టారు. దీంతో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వద్దకు వెళ్లి సిరాజ్ చెప్పడంతో రహానే అంపైర్ల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తద్వారా ఆట పది నిమిషాల పాటు నిలిపివేయబడింది. ఆ టైంలో స్పెక్టేటర్లు కొంతమందిని స్టాండ్ల నుండి బయటకు పంపించేశారు.

అంపైర్లతో చెడామడా వాదించిన రహానే
తాజాగా రహానే సిరాజ్ ఎపిసోడ్ గురించి పూస గుచ్చినట్లు వెల్లడించాడు. 'సిరాజ్ నాలుగో రోజు మళ్లీ నా వద్దకు వచ్చి అతన్ని స్టాండ్స్ లో ఉన్నవాళ్లు తిడుతున్నారని చెప్పినప్పుడు నాకు బాధేసింది. వెంటనే నేను గ్రౌండ్ అంపైర్లు (పాల్ రీఫిల్, పాల్ విల్సన్) వద్దకు వెళ్లాను. ఎవరైతే స్టాండ్స్లో గలీజ్ మాటలు అంటున్నారో వారిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పాను. మీరు యాక్షన్ తీసుకునే దాకా మేం ఆడేది లేదని ఖరాఖండిగా అంపైర్లతో అన్నాను. ఇక అంపైర్లు కూడా ఏమాత్రం పట్టనట్లు మీరు మ్యాచ్ ఆపలేరు. అవసరమైతే మీరే బయటకు వెళ్లవచ్చని నిర్దయతో మాట్లాడారు.

మీరెవరండీ చెప్పడానికి
అంపైర్లు అంత ఖండకావరంతో వ్యవహరించేసరికి రహానే సైతం దీటుగా స్పందించాడు. 'అంపైర్లు అలా అనడంతో నాకు కోపం వచ్చింది. మీరెవరు చెప్పడానికి. మేము ఇక్కడ ఆడేందుకు వచ్చామని, డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని తినడానికి రాలేదు. మీరు ముందు అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నవారెవరో గుర్తించి గ్రౌండ్ నుంచి బయటకు పంపిస్తారా లేదా అని చెడామాడా అంపైర్లతో వాదించాను. నాతో పాటు టీం మేట్స్ అందరం పట్టుబట్టాము. మా తోటి ఆటగాడి పట్ల జరుగుతున్న వివక్షను మేం తప్పకుండా ఖండించాలి. అతను ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకుని మద్దతుగా నిలబడ్డాం. సిడ్నీ టెస్టులో మాత్రం సిరాజ్ విషయంలో జరిగింది పూర్తిగా తప్పు' అని ఈ సిరీస్పై డాక్యుమెంటరీని ప్రారంభించేందుకు బుధవారం ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో రహానే పేర్కొన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా జోక్యం చేసుకుని..
ఇక ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు చేపట్టింది. కొంతమంది భారత ఆటగాళ్లను జాతిపరంగా ప్రేక్షకుల్లోని కొందరు దూషించారని ధృవీకరించింది. భారత క్రికెట్ జట్టు సభ్యులు జాతి వివక్షకు గురయ్యారని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రెటీ చీఫ్ సీన్ కారోల్ ఒక ప్రకటనలో తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టికెటింగ్ డేటా, ప్రేక్షకులను విచారించడం, స్పెక్టేటర్ల ద్వారా అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందెవరో గుర్తించింది. వాళ్లను పోలీసుల చేత స్టేడియం నుంచి గెంటివేయించింది. కొందరికి కొన్ని మ్యాచ్ ల పాటు స్టేడియంలలోకి రాకుండా కూడా నిషేధం విధించింది. తర్వాత ఈ సిరీస్ సజావుగా సాగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications