అందరూ ఖాళీ స్టేడియాలలో దేశీయ క్రికెట్ ఆడారు:
ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఏర్పాటు చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో రహానే మాట్లాడుతూ... 'కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ ఊహించని విషయాలు జరగవచ్చని నేర్పింది. ప్రస్తుతం మనం ఏమి చేస్తున్నామో దాని పట్ల సంతోషంగా ఉండాలి. మన వద్ద ఉన్న వారికి విలువ ఇవ్వాలి. ఐపీఎల్ లేదా మరే ఇతర క్రీడ అయినా ప్రేక్షకులు లేకుండా ఆడవచ్చని నేను భావిస్తున్నా. అందరూ ఖాళీ స్టేడియాలలో దేశీయ క్రికెట్ ఆడారు కాబట్టి అది కూడా మంచి అనుభవాన్ని ఇస్తుంది' అని అన్నాడు.
ఖాళీ స్టేడియాల్లో ఆడేందుకు సిద్ధం:
'అభిమానులు మనకు ఎంతో ముఖ్యం. కాబట్టి వాళ్ల భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అందుకే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడితే .. వాళ్లు హాయిగా మ్యాచ్లను ఇంటి నుంచి చూస్తారు. మాకు ఓ కొత్త అనుభూతి ఉంటుంది. ఖాళీ స్టేడియంలో మ్యాచ్లు పెడతామంటే ఆడేందు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని రహానే పేర్కొన్నాడు.
నా భార్యకు సహాయం చేస్తున్నా:
'లాక్డౌన్ సమయంలో సాధ్యమైనంత సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. నా భార్య, కుమార్తెతో ఇంట్లో ఉంటూ సమయం గడుపుతున్నా. వారితో మరింత బంధం పెరగడానికి నాకు అవకాశం దొరికింది. ఇంట్లో వంట చేస్తూ, పాత్రలు శుభ్రం చేస్తూ నా భార్యకు సహాయం చేస్తున్నా' అని రహానే తెలిపాడు. 'నా కరాటే నైపుణ్యాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నా. ఇది నా చురుకుదనం మరియు ఫిట్నెస్ను కాపాడుకోవడంలో ఖచ్చితంగా సహాయపడుతుంది' అని వైస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
ఫెదరర్ను కలవడం అభిమాన క్షణం:
బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రోల్ మోడల్స్ అని అజింక్య రహానే చెప్పాడు. 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫెదరర్ను కలవడం తనకు అభిమాన క్షణం అని వెల్లడించాడు. రహానే భారత్ తరఫున 65 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. మొత్తంగా 14 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు చేసాడు. ఇక 140 ఐపీఎల్ మ్యాచ్లలో రెండు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేసాడు.