ఒక్క మ్యాచుతోనే చెడ్డ ఆటగాళ్లు అయిపోరు:
తాజాగా అజింక్య రహానె మాట్లాడుతూ... 'షార్ట్ బంతులపై అతిగా చర్చిస్తున్నారు. గతంలోని మెల్బోర్న్ ఇన్నింగ్స్ చూస్తే అందులో మేం షార్ట్ బంతుల్ని అద్భుతంగా ఆడాం. కేవలం ఒక్క మ్యాచుతోనే చెడ్డ ఆటగాళ్లు అయిపోరు. వేర్వేరు ఫార్మాట్లలో మేం బాగానే ఆడుతున్నాం. కివీస్ పేసర్లు చల్లగాలి పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. చల్లగాలి ప్రభావంతో మా బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్లో బాగా ఆడేందుకు మేం సానుకూలంగా ఉండాలి' అని అన్నాడు.
ఫామ్ గురించి విచారించను:
'నా మెల్బోర్న్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే.. నేను షార్ట్ పిచ్ బంతుల్ని బాగా ఎదుర్కొన్నా. న్యూజిలాండ్లో ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకొని మేం పాఠాలు నేర్చుకోవాలి. గత నాలుగేళ్లుగా మేం అద్భుతంగా ఆడుతున్నాం. నా ఫామ్ గురించి అతిగా విచారించను' అని రహానె పేర్కొన్నాడు. కివీస్ సిరీస్లో రహానె 46, 29 (వెల్లింగ్టన్), 7, 9 (క్రైస్ట్చర్చ్) పరుగులు చేశాడు.
ఓటములను కూడా స్వీకరించాలి:
'టెస్టు ఛాంపియన్షిప్లో ఒకసారి ఒక్క మ్యాచ్, సిరీస్ గురించే ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కో మ్యాచ్ గెలుస్తూ పోతేనే పాయింట్లు వస్తాయి. అప్పుడప్పుడు ఓటములూ ఎదురవుతాయి. అన్నింటినీ స్వీకరించాలి. భారత్-ఏ షాడో పర్యటనలతో చాలా ఉపయోగం ఉంది. అక్కడి వాతావరణం, పరిస్థితుతులు అలవాటవుతాయి. అంతర్జాతీయ మ్యాచులకు ఉపయోగించే పిచ్లపై ఆడితేనే మరింత ప్రభావం ఉంటుంది. రంజీ, భారత్-ఏ పర్యటనల మధ్య సమతూకం అవసరం. దేశవాళీ క్రికెట్కు అత్యంత ప్రాధాన్యమిస్తాను. సమయం దొరికితే కచ్చితంగా ఆడతాను' అని రహానె చెప్పుకోచ్చాడు.
కరోనా ప్రభావం ఎలా ఉంటుందో:
'ఐపీఎల్ మ్యాచులపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడే ఏం చెప్పలేం. ఇంకా రెండు వారాల సమయం ఉంది. అప్పటిలోగా ఏం జరుగుతుందో చూడాలి. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలదు. జట్లు, ఫ్రాంచైజీలతో పాలక మండలి చర్చించి పరిష్కారాలు కనుగొంటుంది' అని రహానె తెలిపాడు.