హైదరాబాద్: వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతోన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు షాక్.. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ మ్యాచ్లో బట్లర్ 94 పరుగులు చేయడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబైపై ఈజీగా గెలిచింది రాజస్థాన్. 12 మ్యాచుల్లో 6 విజయాలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి.. బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మినిమమ్ ఓవర్ రేటు కూడా నమోదుచేయలేకపోయింది.
ఈ నిర్లక్ష్యానికి పర్యావసానంగా ఆ జట్టు కెప్టెన్ రహానేపై రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నామని నిర్వహక సంఘం వెల్లడించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం స్లో ఓవర్ రేటుకు సంబంధించి ఇది మొదటి నేరం కావడంతో జరిమానాతో సరిపెట్టామని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబైపై ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మొదట జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు 168 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు జోస్ బట్లర్ చెలరేగి పరుగులు చేయడంతో అలవోకగా విజయాన్ని అందుకుంది. గతంలో చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్రేటు నమోదుచేయడంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇంతకుముందు కోల్కతాపై ఆడిన మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయింది. కానీ, ఈ సారి పోటీకి ఇరు జట్లు సమానమైన పాయింట్లు 12తోనే బరిలోకి దిగనున్నాయి.