న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు. అతడిలో ఉండే స్థిరత్వం ఎనలేనిదని కితాబిచ్చాడు. అదే అతన్ని పరుగుల రారాజుగా నిలబెట్టిందని అభిప్రాయపడ్డాడు. గత మూడేళ్ల పాటు సెంచరీ కోసం నిరీక్షించిన తన అభిమానులకు ఆసియా కప్ ద్వారా విరాట్ కోహ్లీ భారీ ఉపశమనం అందించాడు. ఆ నాటి నుంచీ ఆటలో విజృంభిస్తూనే ఉన్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో తనదైన బ్యాటింగ్తో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ ఇన్నింగ్స్ ఫిదా అయిన అజేయ్ జడేజా.. క్రిక్బజ్ షోలో విరాట్ ఆటను కొనియాడాడు.'ప్రపంచంలో పేరున్న క్రికెటర్లకు ఉన్న గొప్ప సామర్థ్యం విరాట్లో లేకపోవచ్చు. తనకన్నా గొప్పగా ఆడే వారు భారత జట్టులో ఉండివుండవచ్చు. కానీ అతనిలో ఉండే స్థిరత్వం మరెవరీలోనూ లేదు. గతంలో విరాట్ కోహ్లీ రన్స్ తీసి ఔటైతే ఎంఎస్ ధోనీ మిగిలిన ఆటను పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు అతడి చుట్టూ ఉన్న టీమ్ మారింది. దానివల్ల తనతో పాటు ప్రతిఒక్కరికీ కొత్త బంతులతో ఆడటం తేలికైంది.
పటిష్టంగా నిలబడి మ్యాచ్ను గెలిపించగల దృఢమైన వ్యక్తి అతను. పరుగుల వీరుడిగా తనకు దక్కిన గుర్తింపునకు కారణం కేవలం ఆడే సామర్థ్యం మాత్రమే కాదు. అంతకు మించి అతనో స్థిరమైన ఆటగాడు. భారత క్రికెట్కు కావలసింది కూడా అదే అని నేను ఆశిస్తాను. ఆటను ఎలా నడిపించాలో కోహ్లీకి తెలుసు'అంటూ చెప్పుకొచ్చాడు. ఆసీస్తో జరిగిన టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఆడిన కోహ్లీ.. 48 బంతుల్లో 63 పరుగులు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కీలక టీ20 ప్రపంచకప్ ముందు కింగ్ కోహ్లీ ఒకప్పటిలా ఆడుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు భారీ విరాట్ కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్, విరాట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.