పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ప్రసాద్
అయితే, ఇప్పుడు సెహ్వాగ్ తన మెంటార్ పదవి నుంచి తప్పుకోవడంతో వెంకటేశ్ ప్రసాద్ కూడా తన కోచింగ్ పదవి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత వారంలోనే ఐపీఎల్ 2019 సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ న్యూజిలాండ్ జాతీయ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్ను హెడ్ కోచ్గా నియమించింది.
వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో శ్రీధరన్ శ్రీమాన్
ఇదిలా ఉంటే మాకు అందుకున్న సమాచారం ప్రకారం వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో శ్రీధరన్ శ్రీమాన్ పంజాబ్ జట్టు బౌలింగ్ కోచ్గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీధరన్ శ్రీమాన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో శ్రీధరన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో కలిసి బ్యాక్రూమ్ స్టాఫ్గా పనిచేశారు.
అధికారిక ప్రకటన చేసిన సెహ్వాగ్
కాగా, శనివారం వీరేంద్ర సెహ్వాగ్ వచ్చే ఐపీఎల్ సీజన్లో తాను కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు మెంటార్గా వ్యవహరించడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2015లలో కింగ్స్ ఎలెవన్ జట్టు తరఫున ఆడిన సెహ్వాగ్ ఆ తర్వాత మూడు సీజన్లుగా మెంటార్ వ్యవహారిస్తున్నాడు. అయితే, తన పదవి నుంచి తప్పుకున్న సెహ్వాగ్ తనంతట తానుగా బయటకు రాలేదని తెలిపాడు.
నిర్ణయం ఫ్రాంచైజీదేనన్న సెహ్వాగ్
ఈ నిర్ణయం ఫ్రాంచైజీదేనని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. "ఫ్రాంచైజీ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. తమకు ఇకపై బ్రాండ్ అంబాసిడర్ కానీ లేదా మెంటార్ కానీ అవసరం లేదని వారు అందులో తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు పంజాబ్ జట్టులో భాగంగా ఉండటం సంతోషం. నేను తప్పుకోవాలనేది వారి నిర్ణయం. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. గతంలో ఒకసారి ప్రీతి జింటాతో చెలరేగిన వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. వారు కొత్త మెంటార్ లేదా కొత్త అంబాసిడర్ కావాలని కోరుకుంటే అది వారి ఇష్టం" అని సెహ్వాగ్ చెప్పాడు.