హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చెత్త ప్రదర్శన చేయడంపై ఆ జట్టు కెప్టెన్ గుల్బదిన్ నైబ్ మండిపడ్డాడు. ఎన్నో ఆశలతో ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టిన ఆప్ఘనిస్థాన్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రపంచకప్కు ముందు జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు అసలు సిసలైన టోర్నీకి వచ్చే సరికి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆప్ఘన్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాడని భావించిన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకుని ఓ చెత్త రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆప్ఘనిస్థాన్ 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం రషీద్ ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ గుల్బదిన్ నైబ్ మండిపడ్డాడు.
"రషీద్ జట్టు కోసం 100 శాతం కష్టపడుతున్నాడు. అయితే అతని ఫీల్డింగ్ నన్ను కాస్త నిరాశపరిచింది. గతంలో రషీద్ ఖాన్ మైదానంలో చాలా దూకుడుగా ఉండేవాడు. నేను కాస్త నెమ్మదిగా ఉండి.. బౌలింగ్పై దృష్టి పెట్టమని చెప్పాను. దీంతో అతడికి ఫీల్డింగ్పై ఏకాగ్రత తగ్గిందని భావిస్తున్నా" అని గుల్బదిన్ నైబ్ అన్నాడు.
"టాస్ గెలవడం నాకు సంతోషంగానే ఉంది. కానీ మేము రెండు క్యాచులు వదిలేశాం. దాంతో ప్రత్యర్థి జట్టుకు 30-35 పరుగులు వచ్చాయి. మిస్ ఫీల్డింగ్ వల్లే మేం అవకాశాన్ని కోల్పోయాం. ఇంకా తొలి 10 ఓవర్లలో మేము సరిగ్గా బౌలింగ్ చేయలేదు. దాంతో వాళ్లు 50కి పైగా పరుగులు సాధించారు" అని నైబ్ అన్నాడు.