హైదరాబాద్: టీమిండియాతో జరగనున్న చారిత్రత్మక టెస్టుకు తాము సిద్దంగా ఉన్నామని అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గార్ స్టానిక్జాయ్ తెలిపాడు. ఈ టెస్టుకు కెప్టెన్ కోహ్లి దూరం కావడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. కొద్ది రోజులుగా అఫ్గాన్తో జరగనున్న టెస్టుకు కోహ్లి దూరం అవుతున్న విషయంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అస్గార్ ఇలా స్పందించాడు. తాము భారత్తో ఆడటానికి సిద్దంగా ఉన్నామని, కోహ్లి ఒక్కడితో ఆడటానికి కాదని పేర్కొన్నాడు.
'భారత ఆటగాళ్లందరూ.. కోహ్లి సామర్థ్యానికి సమానులే. మేం భారత్తో ఆడుతాం. కానీ కోహ్లితో కాదు.' అని తెలిపాడు. భారత పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయని, ఇది తమకు కలిసొచ్చే అంశమని అస్గార్ అభిప్రాయపడ్డాడు.
'భారత పరిస్థితులు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. అదృష్టవశాత్తు మా జట్టులో మంచి స్పిన్నర్లున్నారు. రషీద్, ముజీబ్ల ప్రదర్శన మేం గర్వించేలా ఉంది. మా బ్యాట్స్మన్ మంచి ఫామ్లో ఉన్నారు. గత మూడు, నాలుగేళ్లుగా మా జట్టు సమన్వయం బాగుంది. మేం మంచి క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాం.' అని తెలిపాడు.
ఇంగ్లాండ్ పర్యటన దృష్ట్యా కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్తుండటంతో చారిత్రత్మక టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా జరిగే ఈ టెస్టు అఫ్గాన్కు తొలి అంతర్జాతీయ టెస్టు. కోహ్లి గైర్హాజరితో అజింక్యా రహానే టీమిండియాకు కెప్టెన్సీ వహించనున్నాడు. ప్రస్తుతం రహానె రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఐపీఎల్లో ఆడుతున్నాడు.