హైదరాబాద్: ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతోంది అఫ్గనిస్తాన్ జట్టు. చాలాకాలం క్రిందట ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ మండలి)కి అసోసియేట్ సభ్యత్వంతో ఉన్న జట్టు మళ్లీ అదే దిశగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ జట్టు ఆటగాళ్లు ఫిట్గా ఉంటూ.. ర్యాంకుల్లోనూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లోనూ గెలవాలనే కసితో పోరాడుతున్న అఫ్గాన్ యువ క్రికెటర్లు శిక్షణలోనూ అలాంటి కసినే ప్రదర్శిస్తున్నారు.
తమ అంతర్జాతీయ షెడ్యూల్ తీరిక లేకుండా ఉండటంతో చెన్నై వేదికగా శిక్షణ పొందుతున్నారు. శ్రీ రామచంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్సెస్లోని 36 మంది ప్లేయర్లు ఫిట్నెస్ మరియు ఆటలో మెలకువల గురించి శిక్షణ పొందుతున్నారని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అఫ్గాన్ స్టార్ ప్లేయర్లైన రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ షెహ్జాద్లు అదే క్యాంపులో కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అవుతారని తెలిపింది.
దానికి కారణం కూడా లేకపోలేదు వారంతా.. యూఏఈ వేదికగా టీ10లీగ్లో ఆడుతూ బిజీగా ఉన్నారట. శిక్షణ సెంటర్ డైరక్టర్ సంజయ్ మాట్లాడుతూ..నెలరోజుల పాటుగా చెన్నై స్టేడియంలో ఆటగాళ్లంతా ప్రాక్టీసులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇందులో అత్యవసర జట్టుగా కొంతమందితో డిసెంబరు 4న శ్రీలంక బయల్దేరనుంది. ప్రస్తుతం చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో.. వారు అవుట్ డోర్లో ప్రాక్టీసును ఆపేసి ఇన్డోర్లోనే చేస్తున్నారు.
వచ్చే ఏడాది జూన్ నెలలో భారత్తో తలపడాల్సి ఉన్న అఫ్ఘనిస్తాన్.. ఏకైక టెస్టులోనూ ఏడు వన్డేల్లోనూ 3 టీ20ల్లోనూ ఆడనుంది. సంవత్సరాంరంభంలో జింబాబ్వే వేదికగా జరిగిన ప్రపంచ కప్ అర్హత టోర్నీలో అఫ్గాన్ సఫలీకృతమైంది. విండీస్ జట్టు మాజీ ఆల్ రౌండర్ ఫిల్ సైమన్స్ ప్రస్తుత అఫ్గాన్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు.