చరిత్ర సృష్టించిన రషీద్:
లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో భారత్తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ 159 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలుపొందిన టీమ్లో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అదిల్ రషీద్ అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ చరిత్రలో టెస్టు మ్యాచ్లో బౌలింగ్ చేయకుండా.. బ్యాటింగ్కు దిగకుండా.. కనీసం ఒక్క క్యాచ్ అయినా అందుకోకుండా, స్టంపింగ్లో లేదా రనౌట్లోనూ భాగస్వామ్యం లేకుండా టెస్టు మ్యాచ్ విజయం సాధించిన జట్టులో ఉన్న 14వ ప్లేయర్గా రషీద్ నిలిచాడు.
ఆడకుండానే రూ. 11లక్షలు ఇంటికి:
13 ఏళ్లలో అరుదైన ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ క్రికెటర్ రషీద్ కావడం విశేషం. మ్యాచ్ ఫీజులో భాగంగా అతడు 12,500 యూరోలు(భారత కరెన్సీలో రూ.11,09,220) ఇంటికి తీసుకెళ్లనున్నాడని బ్రిటీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఫాస్ట్బౌలర్లు ఇన్స్వింగర్లు, ఔట్స్వింగర్లతో భారత్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జేమ్స్ ఆండర్సన్, బ్రాడ్ విజృంభించారు.
రషీద్ అలా ఉండిపోవడానికి కారణం:
దాంతో ఇక ఆ జట్టులో ఉన్న అదిల్ రషీద్కు బౌలింగ్ చేసే అవకాశమే లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 107కే ఆలౌటైంది. ఈ తరువాత బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ 396/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లోనూ రషీద్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తరువాత టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా పేసర్లు చెలరేగుతున్న వేళ రషీద్ బంతులు వేసే ఛాన్స్ రాలేదు.
ఇంగ్లాండ్ విజయంలో రషీద్ లేకపోవడంతో
మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఎక్కువగా స్లిప్ ఫీల్డర్లకు చిక్కడం, ఎల్బీగా వెనుదిరగడంతో క్యాచ్ పట్టే ఛాన్స్ లేకపోయింది. రనౌట్ విషయంలోనూ రషీద్కు అదృష్టం కలిసిరాలేదు. రెండో ఇన్నింగ్స్లో భారత్ కథ ముగియడంతో ఇంగ్లాండ్ విజయంలో రషీద్ పాత్ర లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు భారత జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వడంపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.