
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ సందర్భంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు కాస్త భయపడ్డామని పేస్ బౌలర్ కమలేష్ నాగర్కోటి అన్నాడు. తాజాగా ముంబై మిర్రర్కు ఇచ్చిన ఇంటర్యూలో కమలేష్ నాగర్కోటి తన వరల్డ్ కప్ అనుభవాలను పంచుకున్నాడు.
ద్రవిడ్ సర్ విధించిన కర్ఫ్యూని తామెప్పుడూ ఉల్లంఘించలేదని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్లోని భారత అండర్-19 జట్టు పరాజయమనేదే లేకుండా వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో బాగా ఆకట్టుకున్న కుర్రాళ్లలో 18 ఏళ్ల నాగర్కోటి కూడా ఒకడు. టోర్నీ అసాంతం నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
గురువారం మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్లో కొన్నిసార్లు సాహసాలు చేద్దామనుకున్నా కోచ్ అనుమతించలేదని తెలిపాడు. ఓపెనర్ మన్జోత్ కల్రా, మరో పేసర్ శివమ్ మావితో కలిసి క్వీన్స్ టౌన్లో ఇంటర్యూ ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్న సాహస కార్యకలాపాలు మమ్నల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
'టోర్నమెంట్ జరుగుతోంది. అనవసర సాహసాలు చేయడం సరికాదు అని ద్రవిడ్ సర్ చెప్పాడు. దీంతో మా ప్లాన్ను అప్పటికప్పుడే విరమించుకున్నాం. సరదాగా బయటికెళ్లడానికి కొన్నిసార్లు అనుమతించినా.. నిర్ణీత సమయంలోపు హోటల్కు రావాలని కచ్చితంగా చెప్పేవాడు' అని నాగర్కోటి అన్నాడు.
ద్రవిడ్ విధించిన కర్ఫ్యూని ఎప్పుడైనా ఉల్లంఘించేందుకు ప్రయత్నించారా? అని అడిగిన ప్రశ్నకు 'నిజం చెప్పాలంటే. ద్రవిడ్ సర్ అంటే మాకు కాస్త భయం. అందుకే ఎప్పుడూ అలాంటి పనిచేయలేదు. కొన్నిసార్లు అలా చేయాలనుకున్నా 'సర్ బాగా ఆలోచించే ఈ నిషేధాజ్ఞలు పెట్టి ఉంటాడు' అని భావించి, ఆజ్ఞలకు కట్టుబడి ఉండేవాళ్లంట అని చెప్పాడు.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా తాను తీసుకున్న తొలి అటోగ్రాఫ్ ద్రవిడ్దేనని కమలేష్ నాగర్కోటి తెలిపాడు. త్వరలో జరగనున్న తన తొలి ఇంగ్లాండ్ పర్యటనపై కూడా కమలేష్ నాగర్కోటి స్పందించాడు. 'నా తొలి విదేశీ పర్యటన ఎలాగ ఉండబోతుందో తలచుకుంటేనే ఆనందంగా ఉంది. అలాంటి ప్రదేశాలను గతంలో టీవీలో మాత్రమే చూశా. నిజంగా చూడటం చాలా సంతోషం. అక్కడి ప్రజలు ఎంతో నిజాయితీతో ఉంటారని, వారి నుంచో చాలా నేర్చుకోవచ్చని విన్నా. అక్కడ ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటించాలి' పేర్కొన్నాడు.