నాలుగు సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్కు సురేశ్ రైనా లాంటి డెడికేటెడ్ బ్యాటర్ అవసరం చాలా ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అత్యంత పేలవంగా సీఎస్కే ఆడింది. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఎడమచేతి వాటం బ్యాటర్ సురేష్ రైనాను ఎల్లో ఆర్మీ రిటైన్ చేసుకోలేదు. వేలంలో కూడా రైనాను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోలేదు. ఐపీఎల్ టైటిల్ కోసం మళ్లీ పోటీలోకి రావాలంటే సీఎస్కే రైనా లాంటి వారిని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అయితే 2020 సీజన్లో, 2022 సీజన్లో సీఎస్కేకు రెండు సార్లు రైనా ఆడలేదు. ఆ రెండు సీజన్లలో సీఎస్కే ప్లేఆఫ్ చేరకపోవడం అటుంచితే.. అత్యంత పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి రైనా లేని లోటు సీఎస్కే మీద స్పష్టంగా కన్పిస్తుంది. ఇక స్టార్ ఓపెనర్ డుప్లెసిస్ కూడా లేకపోవడం చెన్నైని బాగా దెబ్బతీస్తోంది.
దాదాపు అన్ని సీజన్లలో సీఎస్కే బానే ఆడింది. కానీ ప్రస్తుత సీజన్లో మాత్రం పేలవంగా ఆడింది. అందుకు చెప్పుకోదగ్గ కారణం సురేష్ రైనా లేకపోవడమేనని మాజీ టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. రైనా ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్న ప్లేయర్. అతను బ్యాటింగ్ ఆర్డర్లో నెం 3 పొజిషన్లో ఆడతాడు. చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈఎప్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో శాస్త్రి మాట్లాడుతూ.. 'అతను తన బ్యాటింగ్తో ఇతర బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేలా చేయగలడు. అలాంటి ఆటగాడిని సీఎస్కే ఇప్పుడు వెతకాల్సిన పని పడింది. రాయుడు, ఉతప్ప లాంటి వారు ఆడుతుండగా వారికి మద్దతుగా నిలిచేలా ఆడే రైనా లాంటి ప్లేయర్ లభించినట్లయితే సీఎస్కే పరిస్థితిలో చాలా తేడా ఉంటుంది.' అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సంవత్సరం ఎడిషన్లో సీఎస్కే పేలవమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టు ఆడిన 14 మ్యాచ్లలో కేవలం నాలుగు మ్యాచ్లను మాత్రమే గెలిచింది. 8పాయింట్లతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో నిలిచిపోయింది. ముంబై, చెన్నై సేమ్ పాయింట్లతో ఉన్నా.. చెన్నై నెట్ రన్ రేట్ తేడా వల్ల అట్టడుగు స్థానం నుంచి తప్పించుకుని ఆ అప్రదిష్ట నుంచి బయటపడింది.
గత సీజన్తో పోలిస్తే.. ఈ సీజన్లో ఎల్లో ఆర్మీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరాన్, పేసర్ దీపక్ చాహర్ సేవలను కోల్పోయింది. ఇకపోతే ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా కెప్టెన్ గా, ప్లేయర్గా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్లో, బౌలింగ్లో చెత్త ప్రదర్శన చేయడం, చివరికి గాయపడడంతో సీజన్కు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మే 24న జరగనుంది.