
హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన బెంగుళూరు జట్టు కేవలం ఒక్కదాంట్లోనే విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పట్టుదలతో కనిపిస్తోంది. మళ్లీ గత సీజన్ ప్రదర్శననే పునరావృతం చేసేందుకు సన్నద్ధమవుతోంది.
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో పేలవ ప్రదర్శనకు ఇక స్వస్థి పలకాలని భావిస్తోంది. మంగళవారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో బెంగళూరు తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వీడియో సందేశంలో ఓ వాగ్దానం కూడా చేశాడు.
ఈరోజు రాత్రి ముంబై ఇండియన్స్తో మేము మ్యాచ్ ఆడబోతున్నాం. కెమెరాకు కుడివైపు నిలబడి ఉన్న గ్యారీ కిర్స్టెన్ నేను ఏం మాట్లాడాలో నాకు చెబుతున్నాడు. మేమంతా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఆర్సీబీ అభిమానులు మాపై ఓ కన్నేసి ఉంచారు. ఈ మ్యాచ్ను మేము గెలవబోతున్నాం. అని వీడియోలో వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
సీజన్లో మూడు మ్యాచ్లాడిన రోహిత్సేన వరుసగా మూడింటిలో పరాజయం పాలైంది. సొంత అభిమానుల మధ్య ఎలాగైనా బెంగళూరుపై గెలిచి తీరాలని ముంబై పట్టుదలగా ఉంది. ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాటం చేసేందుకు సిద్ధమవడంతో పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.