హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ శుభవార్త చెప్పాడు. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లిన డివిలియర్స్ తక్షణమే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో క్రీడా అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇకపై, డివిలియర్స్ ఆటను చూడలేమనుకున్న అభిమానులకు ఓ తీపి కబురు అందించాడు. కొన్నేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను ఆడాలని భావిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్యూలో డివిలియర్స్ వెల్లడించాడు.
''నేను మరికొన్ని సంవత్సరాలు ఐపీఎల్లో ఆడుతాను. టైటాన్స్ తరఫున ఆడి యువ క్రికెటర్లకు సహాయపడాలని ఉంది. కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ నా దగ్గర లేవు. ఈ విషయాన్ని నేను చాలాకాలంగా చెప్పలేకపోయాను'' అని డివిలియర్స్ తెలిపాడు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ విదేశాల్లో జరిగే లీగ్లలో తాను ఆడేది లేదని పేర్కొన్నాడు. దీంతో డివిలియర్స్ బ్యాటింగ్ని ఇకపై తాము చూడలేమని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా డివిలియర్స్ తాను ఐపీఎల్లో ఆడాలని ఉందని చెప్పడంతో క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లీ తర్వాత డివిలియర్స్ కీలకఆటగాడిగా ఉన్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్తో సదరు జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.