హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు డివిలియర్స్ వీడ్కోలు చెప్పగానే క్రికెట్ ప్రముఖులతో పాటు సగటు అభిమాని సైతం అతని ఘనతను నెమరువేసుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ చివరి మ్యాచ్ వరకూ తన ఫామ్ను కొనసాగించాడు. ఈ క్రమంలో అతని జట్టు ఆటగాడైన మొహమ్మద్ సిరాజ్ డివిలియర్స్ గొప్పదనాన్ని పొగిడేస్తున్నాడు.
ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించగానే షాక్కు గురైనట్లు తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ.. డివిలియర్స్లో ఇంకా చాలా ఆట దాగుందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. 480 పరుగులు చేసిన అతని ఖాతాలో.. 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పైగా ఆర్సీబీ నిర్వహించిన క్యాంపులో ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లలో అతనొకడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు జట్టు మంచి ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లలో డివిలియర్స్ ప్రముఖుడు. బుధవారం మధ్యాహ్నం అతని రిటైర్మెంట్ వార్త వినగానే ఆశ్చర్యానికి గురైయ్యాను. అతని ఆటతీరు, ప్రదర్శన ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయి, అతను అంతర్జాతీయ క్రికెట్కు ఆడడం లేదనే మింగుడు పడటం లేదు. ఇంకా చాలా ఆటను అతనిలోనే ఉంచుకుని రిటైర్మెంట్కు సిద్ధమైపోయాడు.
డివిలియర్స్ క్రికెట్ మైదానంలో అన్ని మూలలకు షాట్లకు కొట్టడంలో స్పెషలిస్ట్. డివిలియర్స్ దాదాపు నెట్స్లో ప్రాక్టీసు చేసేప్పుడు భారీ షాట్లు కొట్టేవాడు కాదు. నేరుగా మైదానంలో ఆడేందుకు వచ్చి అద్భుతాలు చేసేవాడు. ఎక్కువ శాతం స్టైట్గానే ఆడేవాడు. అలా ఆడుతుండగా అతనిని అవుట్ చేయడం చాలా కష్టం. చక్కటి హుందాతనం కనబరిచే వ్యక్తి. ఏదో పెద్ద సెలబ్రిటీలా మా ముందు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఎప్పుడూ సరదాగా అందరినీ అలాగే ఉంచుతాడు.