
హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13వ సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున డివిలియర్స్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లో ఆడాలనుకుంటున్న డివిలియర్స్కు ఈ ఐపీఎల్ ఎంతో కీలకం. ఐపీఎల్తో ఏబీ తన ఫామ్ నిరూపించుకోవడానికి తహతహలాడుతున్నాడు.
డివిలియర్స్ ఇటీవలే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్తో సంభాషించాడు. దక్షిణాఫ్రికాపై సద్గురు అభిప్రాయమేంటో ఏబీ అడిగి తెలుసుకున్నాడు. భారత అభిమానుల సమక్షంలో ఏబీ అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానాలిచ్చారు. ఆయన జవాబులకు ఏబీ ఫిదా అయ్యాడు. 'భారతదేశంలోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా' అని సోమవారం ఏబీ ట్వీట్ చేశాడు.
'భారత్లోని ఓ అద్భుత వ్యక్తితో సంభాషించా. మా దేశం, మా ఖండం గురించి మంచి సందేశం ఇచ్చిన సద్గురు జగ్గీవాస్దేవ్కు ధన్యవాదాలు. మా అందరికీ మీరు ప్రేరణగా నిలిచారు. ఏప్రిల్ 4న మిమ్మల్ని ఆహ్వానించేందుకు దక్షిణాఫ్రికా ఎదురుచూస్తోంది. గెలిచేందుకు చెప్పిన సూచనకు కృతజ్ఞతలు' అని ఏబీ ట్వీట్ చేశాడు. 'ఏబీ.. ఆఫ్రికా వచ్చేందుకు నేనెంతగానో ఎదురుచూస్తున్నా. సహజ వనరులు, అద్భుత అవకాశాలు, సుసంపన్నమైన చరిత్ర ఉన్న ఖండం ఆఫ్రికా. మీ సాదర స్వాగతానికి ధన్యవాదాలు' అని సద్గురు రీట్వీట్ చేశారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచేందుకు దక్షిణాఫ్రికా ఏదైనా చేయాలి అని ఆ జట్టు మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డారు. విధ్వంసక బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ను ప్రపంచకప్కు ఎంపిక చేయడం కూడా అందులో ఒకటని అతను పేర్కొన్నారు. నేను ఏబీ డివిలియర్స్కు పెద్ద అభిమానిని అని కూడా జాంటీ రోడ్స్ చెప్పారు. డివిలియర్స్ 2018 మేలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ తరహా లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్కు అవసరమైతే అందుబాటులో ఉంటానని ఏబీ డివిలియర్స్ చెప్పగా.. సెలక్టర్లు అందుకు అంగీకరించలేదు.