మహీ లేకున్నా భారత్ మేనేజ్ చేయగలదు:
'2021 టీ20 ప్రపంచకప్లో ఎంఎస్ ధోనీతో టీమిండియా విజయావకాశాలు ముడిపడ్డాయా?' అని ఓ అభిమాని ఆకాశ్ చోప్రాను అడగ్గా... 'ధోనీ లేకుండా భారత్ రాణించగలదు. నిజం చెప్పాలంటే మనం మాట్లాడేది 2021 గురించి. ఆ టోర్ని భారత్లో జరుగుతుంది కాబట్టి కచ్చితంగా మహీ ఉండాలని అనుకుంటాం. అయితే ధోనీకి ఆడాలని ఉందా? లేదా? అనేదే ముఖ్యం. నేనిప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. అతడికి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలని లేదు. ఒకవేళ ఆడాలని ఉన్నా మనం మాట్లాడేది ఏడాది తర్వాత జరగబోయే టోర్నీ గురించి. కాబట్టి మహీ లేకున్నా భారత్ మేనేజ్ చేయగలదు. అలాగే జరుగుతుందని భావిస్తున్నా. మాజీ కెప్టెన్ అవసరం లేదనుకుంటున్నా' అని బదులిచ్చాడు.
2022 వరకు ఆడతాడు:
ఐపీఎల్లో 2021, 2022 ఎడిషన్లలో కూడా సీఎస్కే ఫ్రాంచైజీలో ఎంఎస్ ధోనీ భాగమవుతాడని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తాజాగా ధీమా వ్యక్తం చేశారు. 2020, 2021 సీజన్లలో కచ్చితంగా మహీ పాల్గొంటాడని, 2022లో సైతం ఆడతాడని తాము అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. 'ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2020, 2021 రెండింటిలో భాగమని మేము ఆశిస్తున్నాం. బహుశా తరువాతి సంవత్సరం 2022 వరకు కూడా ఆయన జట్టులో ఉండవచ్చు' అని విశ్వనాథన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2021 ఐపీఎల్ వేలంలో సీఎస్కే ఎంఎస్ ధోనీని నిలబెట్టుకుంటుందని జట్టు ఫ్రాంచైజీ యజమాని, ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ గత జనవరిలో చెప్పారు.
అందరి చూపూ ధోనీపైనే:
సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఆరంభం అవుతుండటంతో అందరి చూపూ ఇప్పుడు ఎంఎస్ ధోనీపైనే నెలకొంది. మరో నెల రోజుల్లో యూఏఈలో జరగబోయే ఐపీఎల్ పదమూడో సీజన్ కోసం ధోనీ సాధన మొదలుపెట్టాడు. గతవారం మైదానానికి వెళ్లి మరీ ప్రాక్టీస్ చేశాడు. ఝార్ఖండ్ ఇండోర్ వసతిలో బౌలింగ్ యంత్రం సాయంతో మహీ సాధన చేసాడు. సీఎస్కే ఆగస్టు 16 నుంచి 20 వరకు శిక్షణా శిబిరాన్ని ప్లాన్ చేసింది. ఆగస్టు 21న యూఏఈకి బయలుదేరాలని సీఎస్కే ఆశిస్తుండగా.. ఆగస్టు 14న ఆటగాళ్లందరూ చెన్నైలో సమావేశమవనున్నారు.
ధోనీకి కరోనా పరీక్షలు:
యూఏఈ వెళ్లనున్న నేపథ్యంలో ఎంఎస్ ధోనీకి బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనితో పాటు సహచర ఆటగాడు మోనూ కుమార్కు కూడా కోవిడ్-19 పరీక్షలు జరిపారు. ఈ విషయాన్ని పరీక్షల కోసం సాంపుల్స్ సేకరించిన గురునానక్ హాస్పిటల్కు చెందిన మైక్రోప్రాక్సిస్ లాబ్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ తెలిపారు. తమ సిబ్బంది ధోనీ ఫామ్ హౌస్కు వెళ్లి మరి కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్ట్కు సంబంధించిన సాంపుల్స్ కలెక్ట్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. ఫలితాలు ఈరోజు రానున్నాయి.
అనుభవాన్ని వృథా చేయొద్దు.. మాజీ ఆటగాళ్లను ఉపయోగించుకోండి: ద్రవిడ్