
బెంగళూరు: మాజీ ఆటగాళ్ల అనుభవాన్ని వృథా చేయనివ్వవద్దని, క్రికెట్ అభివృద్ధిలో వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సూచించారు. బీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వెబినార్లో ఎన్సీఏ చీఫ్ హోదాలో ద్రవిడ్ ప్రసంగించారు. ఈ ఆన్లైన్ చర్చా కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన కార్యదర్శులు, ఆపరేషన్స్ విభాగాధిపతులతో పాటు ఎన్సీఏ ఎడ్యుకేషన్ హెడ్ సుజిత్ సోమసుందర్, ట్రైనర్ అశిష్ కౌశిక్ హాజరయ్యారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో శిక్షణ శిబిరాల నిర్వహణ విషయంలో ప్లేయర్ల ఫిట్నెస్కు సంబంధించి వివరాల సేకరణ, క్రికెట్ పునరుద్ధరణపై చర్చ జరిగినట్లు రాష్ట్ర కార్యదర్శి ఒకరు మీడియాకు వివరించారు. 'క్రికెట్ అభివృద్ధి కోసం మాజీల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ద్రవిడ్ సూచించారు. వారి అనుభవం, సలహాలు, సూచనలు వృథా అయ్యే పరిస్థితి ఉండకూడదన్నారు. కానీ ఇది తప్పనిసరని చెప్పకుండానే ఆచరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చనట్లు ఆయా రాష్ర్టాల ప్రతినిధులకు సూచించారు' అని ఆయన తెలిపారు.
'ప్రస్తుత పరిస్థితులలో 25 లేదా 30 మంది ఆటగాళ్ళు కలిసి శిక్షణ పొందడం కష్టం కాబట్టి రాష్ట్ర జట్టు శిక్షకులు మరియు ఫిజియోలు ఆటగాళ్లకు సహాయం చేయాల్సి ఉంటుంది. దశలవారీగా వచ్చి శారీరకంగా శిక్షణ పొందవచ్చు' అని సదరు అధికారి పేర్కొన్నారు. మరోవైపు శిక్షణ పునరుద్ధరణలో ఎన్సీఏ రెండు రకాల పద్ధతులను అవలంభించబోతున్నట్లు తెలిసింది.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నాభారత ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి దగ్గరలోని మైదానాల్లో తిరిగి సాధన మొదలుపెట్టారు. త్వరలోనే ఐపీఎల్ 2020, దేశవాళి క్రికెట్ ఆరంభం కానుంది. దీంతో ఆటగాలు అందరూ మైదానాలకు చేరుకుంటున్నారు. ఇదే విషయంపై ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే స్పందించారు. ద్రవిడ్ మాట్లాడుతూ... 'ప్రస్తుతానికైతే ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నారు. ఇప్పటివరకు మేం అదృష్టవంతులం. అక్టోబర్లో దేశవాళి క్రికెట్ తిరిగి ప్రారంభమైనప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది' అని మాజీ కెప్టెన్ చెప్పారు.