ముంబై: ఆసీస్ గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు ముగిశాయి. రెండు వన్డేల్లో పరుగుల వరద పారింది. తొలి వన్డేలో 375 పరుగుల ఛేదనకు దిగిన భారత్ జట్టు 308కే పరిమితమైంది. ఇక రెండో వన్డేలో 390 పరుగుల ఛేదనలో 338తో సరిపెట్టింది. టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ బ్యాట్స్మన్లా ఆరంభాలు ఇవ్వలేదు, భారీ స్కోర్లు చేయలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్ని ఆస్ట్రేలియా 2-0తో చేజిక్కించుకుంది. ఇక నామమాత్రమైన ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అంగీకరించాడు. రోహిత్ రెండు వన్డేల్లో ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2020లో గాయపడిన రోహిత్ను వన్డే, టీ20 సిరీస్కి బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఫిట్నెస్ సాధిస్తే.. డిసెంబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్లో ఆడేందుకు ఆస్ట్రేలియాకి వెళ్లనున్నాడు.
'రెండు వన్డేల్లోనూ స్కోర్ బోర్డుపై భారీ స్కోరు ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్లో కాస్త కంగారు కనిపించింది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో ఉండిఉంటే.. ధైర్యంగా ఉండేది. అంతేకాదు ఛేదనలో టీమిండియా దూకుడుగా ఆడేది. కానీ ఇప్పుడు అతను జట్టులో లేడు. టీమిండియా 350 పైచిలుకు స్కోరు చేయాలంటే.. రోహిత్ సపోర్ట్ కావాలి. అలానే 350+ ఛేదనలోనూ జట్టుకి అతని సాయం అవసరం' అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లోని ఓ వీడియోలో పేర్కొన్నాడు.
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ను 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం సరైన నిర్ణయం కాదని, అతడి పూర్తి సామర్థ్యాన్ని టీమిండియా ఉపయోగించుకోవట్లేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ను ఆరంభించడానికి అర్హుడని పేర్కొన్నాడు. రాహుల్ ఓపెనింగ్ చేస్తే.. తన సహజమైన ఆట ఆడటానికి కూడా సహాయపడుతుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. మొదటి వన్డేలో రాహుల్ 12 పరుగులే చేసినా.. రెండో వన్డేలో 66 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అయితే భారత్ను గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు.
ISL 2020-21: గోవా ఎఫ్సీ vs నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ.. తుది జట్లు ఇవే!!