
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో ఆప్ఘనిస్థాన్ పసికూన. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేయడంతో టెస్ట్ అర్హత సాధించింది. దీంతో టెస్టు హోదా సాధించిన 12వ దేశంగా నిలిచింది. అరంగేట్ర టెస్టులో నంబర్ వన్ ర్యాంకులో ఉన్న భారత్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంది.
బౌలింగ్లో ఫర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్లో పూర్తిగా విఫలం కావడంతో ఎన్నో అంచనాలతో తొలి మ్యాచ్లోనే అదరగొట్టాలనుకున్న ఆప్ఘనిస్థాన్ ఎలాంటి సంచలనాలకు తెరలేపకుండా ఒక్క రోజులోనే ఏడు గంటల్లో రెండు సార్లు ఆలౌటై మ్యాచ్లో ఓటమిపాలైంది.
టెస్టు క్రికెట్లో ఏమాత్రం అనుభవంలేని అఫ్ఘనిస్థాన్ బ్యాట్స్మన్ భారత బౌలర్ల దెబ్బకు ఒకరి తరవాత మరొకరు పెవిలియన్కు క్యూ కట్టడంతో ఐదు రోజుల మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు, ఫాలోఆన్లోనూ 38.4ఓవర్లలో 103పరుగులకే కుప్పకూలింది.
దీంతో ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఓటమి భారంతో ఉన్న అప్ఘనిస్థాన్ ప్లేయర్లకు టీమిండియా మంచి ఉపసమనాన్ని కలిగించింది. సాధారణంగా టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత గెలిచిన జట్టు ప్రజెంటేషన్ అనంతరం ట్రోపీతో కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం తెలిసిందే.
ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారత్ విజయం సాధించడంతో ట్రోఫీతో టీమిండియా ఫొటో దిగేటప్పుడు కెప్టెన్ రహానే అఫ్ఘనిస్తాన్ ప్లేయర్లను కూడా ఆహ్వానించాడు. దీంతో అఫ్ఘన్ క్రికెటర్లు ఉత్సాహాంగా భారత ఆటగాళ్లతో కలసి ట్రోఫీతో ఫొటో దిగారు. రహానే అయితే అఫ్ఘన్ ఆటగాళ్ల భుజాల చేయివేసి మరీ ఫొటోలకు పోజిచ్చాడు.
ఈ సన్నివేశం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. అభిమానులు సైతం పిక్చర్ ఆఫ్ ద డే అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. ఐసీసీ సైతం దీనిని చరిత్రాత్మక ఫోటోగా అభివర్ణించింది.