గణాంకాలే చెబుతున్నాయి: ఈ దశాబ్దం టీమిండియాదేనని!

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జూన్ 2016 నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా టీమిండియా 300 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో 60 పాయింట్ల ఉన్నాయంటే టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత మూడేళ్లుగా టెస్టు ర్యాంకింగ్స్లో ఆగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా గెలుపు-ఓటముల నిష్పత్తిలో ఏ జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దశాబ్దం టీమిండియాదేనని చెప్పాలి. ఓ దశాబ్దకాలంలో అత్యధిక సక్సెస్ రేషియోని కలిగిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 2010 నుంచి ఇప్పటివరకు టీమిండియా మొత్తం 106 టెస్టు మ్యాచ్లాడి 55 టెస్టుల్లో విజయం సాధించి... 29 టెస్టుల్లో ఓడిపోయింది.
టీమిండియా గెలుపోటముల నిష్పత్తి 1.90గా ఉంది. దక్షిణాఫ్రికా 1.76తో (89 టెస్టుల్లో 44 విజయాలు, 25 ఓటములు) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్ల సక్సెస్ రేషియో వరుసగా 1.39, 1.30, 1.07, 0.91, 0.79గా నమోదైంది.

ఈ దశాబ్దంలో టాప్ -7 గెలుపు-ఓటమి నిష్పత్తులివే
1.90 - India (played: 106, won: 55, lost:29)
1.76 - South Africa (p:89, w:44, l:25)
1.39 - Australia (p:108, w:53, l:38)
1.30 - England (p:123, w:57, l:44)
1.07 - New Zealand (p:79, w:31, l:29)
0.91 - Pakistan (p:79, w:32, l:35)
0.79 - Sri Lanka (p:93, w:31, l:39)

అత్యధిక సక్సెస్ రేషియో
ఇలా ఓ దశాబ్ద కాలంలో అత్యధిక సక్సెస్ రేషియోని సాధించడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ ఎక్కువగా క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవి. ఎందుకంటే ఆ రెండు జట్లు 1877లో తొలి టెస్టు మ్యాచ్ను ఆడాయి కాబట్టి. అయితే, 1980ల్లో వెస్టిండీస్ క్రికెట్లో తిరుగులేని జట్టుగా ఎదగడం ప్రారంభించింది.

1990ల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా సఫారీలు
90ల్లో దక్షిణాఫ్రికా తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి పునఃప్రవేశించిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జట్లకు ధీటుగా ఎదిగింది. ఈ క్రమంలో 1990ల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. అయితే, స్టీవ్ వా, రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా కొత్త మిలీనియంలో వరల్డ్ లీడర్ స్టేటస్ను సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా రికార్డు
అత్యధికంగా 2000-2010 కాలంలో ఆస్ట్రేలియా అత్యధికంగా 4.39 సక్సెస్ రేషియోతో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం కొనసాగుతున్న దశాబ్దం యొక్క రెండో అర్ధభాగంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. (డిసెంబర్ 2010-నవంబర్ 2014) మధ్య కాలంలో మొత్తం 38 మ్యాచ్లకు గాను 16 టెస్టుల్లో ఓడిపోయిన 14 టెస్టుల్లో విజయం సాధించింది.

22 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్టు సిరిస్
ఇందులో ఇంగ్లాండ్ చేతిలో 1-3తో ఓటమి, న్యూజిలాండ్ చేతిలో 0-1తో ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-1తో టెస్టు సిరిస్ను చేజార్చుకున్నవి ఉన్నాయి. జనవరి 2015లో ధోని నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 22 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్టు సిరిస్ నెగ్గింది.

2016లో టెస్టుల్లో అగ్రస్థానం
ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో కైవసం చేసుకుని వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఇంగ్లాండ్ గడ్డపై నిరాశ పరిచిన కోహ్లీసేన... ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

కోహ్లీ నాయకత్వంలో అత్యుత్తమ జట్టుగా
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా కొనియాడబడుతుంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, పుజారా, రహానేలు నిలకడగా ఆడుతుండగా.. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే ఇటీవలి కాలంలో భారత బౌలర్లు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారిస్తున్నారు.

అత్యుత్తమ పేస్ ఎటాక్
ప్రస్తుతం టీమిండియా జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో కూడిన అత్యుత్తమ పేస్ ఎటాక్ను కలిగి ఉంది. స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరికితోడు చైనామన్ స్పిన్నర్లు యుజవేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లు జట్టుకు అదనపు బలం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications