సఫారీ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన
ఈ ఏడాది ప్రారంభంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు గాను సఫారీ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్లో మ్యాచ్లకు మధ్యలో కాస్త విరామం లభించడంతో రోహిత్ శర్మ-రితిక, రహానే-రాధిక, జడేజా కలిసి జంగిల్ సఫారీకి వెళ్లారు.
రెండు చిరుతలు అటువైపు వచ్చాయి
ఆ సమయంలో చోటు చేసుకున్న ఓ సన్నివేశాన్ని రోహిత్ శర్మ, రహానే ఈ సందర్భంగా వెల్లడించారు. ‘అందరం కలిసి ఆ అడవిలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో రెండు చిరుతలు అటువైపు వచ్చాయి. ఆ రెండు చిరుతలు మాకు చాలా సమీపంగా వచ్చాయి' అని అన్నాడు.
జడేజాపై అందరికీ చాలా కోపం వచ్చింది
'వెంటనే, మేమంతా షాక్కు గురై వాటినే చూస్తూ ఉన్నాం. ఇంతలో జడేజా ఏదో శబ్దం చేస్తూ వాటిని పిలవడం మొదలుపెట్టాడు. ఇంకేముందు ఆ రెండు చిరుతలు వెనక్కి తిరిగి మమ్ముల్ని చూశాయి. దేవుడా అయిపోయాం అని అనుకున్నాం. జడేజాపై అందరికీ చాలా కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నావు? మనం అడవిలో ఉన్నాం. అవి మనల్ని చూస్తే.. వాటికి ఆహారం అయిపోతాం' అని రోహిత్ శర్మ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
జడేజాను ఒక గుద్దు కూడా గుద్దాను
ఆ సమయంలో జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక గుద్దు కూడా గుద్దాను అని రోహిత్ శర్మ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కొంతసేపటి తర్వాత అవి అటు-ఇటు చూసుకుంటూ వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాం. నిజం చెప్పాలంటే ఆ సమయంలో మా కంటే మా భార్యలే ఎక్కువ ధైర్యంగా ఉన్నారు. జడేజాతో మాత్రం ఇక ఎప్పుడూ... ఎక్కడికీ వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం' అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఈ పర్యటనలో రోహిత్ శర్మ విఫలం
సఫారీ పర్యటనలో ఒక్క రోహిత్ శర్మ విఫలం కాగా, మిగతా క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ పర్యటన మొత్తంమీద రోహిత్ శర్మ కేవలం ఒక సెంచరీనే నమోదు చేయగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆరు వన్డేల సిరిస్ను 5-1తేడాతో... మూడు టీ20ల సిరిస్ను 2-1తేడాతో టీమిండియా నెగ్గింది. తద్వారా సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరిస్ను గెలిచిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.