సఫారీ గడ్డపై అరుదైన ఘనత
ఆరో వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుంది. సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాపై ఓ ద్వైపాక్షిక సిరిస్లో ఐదు వన్డేలు గెలిచిన రెండో జట్టుగా అరుదైన ఘనత సాధిస్తుంది. అంతకముందు ఈ ఘనతను 2001-2002లో ఆస్ట్రేలియా సాధించింది.
మరో మూడు వికెట్ల దూరంలో కుల్దీప్ యాదవ్
ఈ సిరిస్లో ఇప్పటివరకు భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసిన వికెట్లు 16. మరో మూడు వికెట్లు తీస్తే ఓ ద్వైపాక్షిక వన్డే సిరిస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, అమిత్ మిశ్రాలు 18 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వెస్టిండిస్ పేసర్ ప్యాట్రిక్ పాట్రిసన్, సఫారీ మాజీ పేసర్ గ్రెగ్ మాథ్యూస్ 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
33 పరుగుల దూరంలో ధోని
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ధోని వన్డే పరుగులు 9,898. పదివేల పరుగుల మైలురాయిని ధోని సునాయాసంగా చేరుకుంటాడని అంతా భావించారు. ఐదు వన్డేలు ముగిసినా పది వేల పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాడు. నాలుగో వన్డేలో 42 పరుగులు మినహా ధోని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్లో ఇప్పటివరకూ ధోని 69 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా పదివేల పరుగుల మార్కుకు 33 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ప్రస్తుతానికి ధోని వన్డేల్లో 9,967 పరుగులతో ఉన్నాడు.
రెండో వికెట్ కీపర్గా ధోని
ధోని పదివేల పరుగుల మైలురాయిని అందుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్గా అరుదైన ఘనత సాధిస్తాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 14,234 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోని పదివేల మార్కును చేరితే ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
మరో మూడు క్యాచ్లు అందుకుంటే
మరో మూడు క్యాచ్లు అందుకుంటే వికెట్ కీపర్గా 400 డిస్మిసల్స్ మార్కుని అందుకుంటాడు. ప్రస్తుతం ధోని ఖాతాలో 293 క్యాచ్లు, 104 స్టంపింగ్స్ ఉన్నాయి. శుక్రవారం సెంచూరియన్ వేదికగా జరిగే మ్యాచ్లో ఈ రెండు ఘనతల్ని సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.