హైదరాబాద్: 'ఇప్పటికే 4-1తో గెలిచాం. కానీ, 5-1తో గెలవాలని ఉంది' అని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. దక్షిణాపర్యటనలో ఉన్న భారత్ ఆరు వన్డేల సిరీస్లో భాగంగా ఐదో వన్డేలో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ ఇలా మాట్లాడాడు.
'చాలా ఆనందంగా ఉంది. రోహిత్ ఈ మ్యాచ్లో బాగా ఆడటం కలిసొచ్చింది. చరిత్ర సృష్టించినందుకు గొప్ప ఫీలింగ్గా ఉంది. గతంలో ఆరు సార్లు భారత్ ఇక్కడ పర్యటించినా లాభం లేకపోయింది. 25 ఏళ్ల తర్వాత సఫారీల గడ్డపై భారత్ తొలిసారిగా సిరీస్ విజయం జట్టులో ప్రతి ఒక్కరి శ్రమవల్లే సాధ్యమైంది.'
'అరుదైన సిరీస్ విజయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. భారత ఆటగాళ్లు ఈ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. 'ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు కీలక ప్రదర్శనతో రాణించారు.'
'ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయి. మణికట్టు స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు. వీరికి తోడు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లు నిలకడగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేశారు.'
'నిజంగా ఈ సిరిస్ ఓ హాల్ మార్క్ లాంటిది. దక్షిణాఫ్రికా గడ్డపై 4-1తో సిరిస్ నెగ్గడం అంత ఈజీ కాదు. గతంలోనూ రెండుసార్లు దక్షిణాప్రికాలో ఆడాం. కానీ ఈసారి 4-1 తేడాతో గెలిచామంటే అది అందరి సహకారంతోనే సాధ్యపడింది.. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఇది జట్టు సమిష్టి విజయం.' అని ప్రసంగించాడు.