టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు వీరే


హైదరాబాద్: టెస్టు క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్థ్యాన్ని కూడా టెస్టు క్రికెట్ వెలికి తీస్తుంది. టెస్టు క్రికెట్లో విజయం సాధించాలంటే ఎంతో కృష్టి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్లకు ఉండాలి.
అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడంకెల స్కోరు నమోదు చేస్తేనే. టీ20ల్లో హాఫ్ సెంచరీ, వన్డేల్లో సెంచరీ, టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేస్తేనే జట్లు విజయాలను నమోదు చేస్తాయి.
ఒక గొప్ప టెస్టు బ్యాట్స్మెన్ అని అనిపించుకోవాలంటే... ఆ ఆటగాడు టెస్టుల్లో సెంచరీలు మీద సెంచరీలు సాధించాలి. డబుల్ సెంచరీలు అయితే ఇంకా మంచిది. ఈ సెంచరీలే టెస్టుల్లో విజయాలను సాధించి పెడతాయి. భారత్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా అద్భుతమైన టెస్టు క్రికెటర్లను మనం చూస్తున్నాం.
టెస్టుల్లో నిలకడ ప్రదర్శించి డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం...:

సునీల్ గవాస్కర్ (4 డబుల్ సెంచరీలు)
80ల్లో పెద్ద స్కోర్లకు పెట్టింది పేరు సునీల్ గవాస్కర్. టీమిండియా అందించిన తొలితరం వరల్డ్ క్లాస్ బ్యాట్స్మన్. ముఖ్యంగా వెస్టిండిస్ బౌలర్లను ఎదుర్కొన్న లెజెండ్. టెస్టుల్లో సునీల్ గవాస్కర్ 34 సెంచరీలు సాధించాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండిస్ జట్టుపై నమోదు చేసిన 236* గవాస్కర్ కెరీర్లో అత్యధిక స్కోరు. గవాస్కర్ చేసిన 4 డబుల్ సెంచరీల్లో 3 వెస్టిండిస్ జట్టుపైనే చేసినవి కావడం విశేషం.

రాహుల్ ద్రవిడ్ (5 డబుల్ సెంచరీలు)
టెస్టు క్రికెట్లో భారత్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకడు. ఎన్నో కఠిన పరిస్థితుల్లో టీమిండియా ఇన్నింగ్స్లో అడ్డుగోడగా నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ఇండియా-ఏ కోచ్గా వ్యవహారిస్తున్నాడు. తన టెస్టు కెరీర్లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 5 డబుల్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్ అత్యధిక స్కోరు 270. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఈ స్కోరు సాధించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, జింబాబ్వే లాంటి జట్లపై రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో సెంచరీలు సాధించాడు.

సచిన్ టెండూల్కర్ (6 డబుల్ సెంచరీలు)
ప్రపంచ క్రికెట్కు పరిచయం అక్కర్లేని పేరు. తన 24 ఏళ్లు సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుపై సచిన్ టెండూల్కర్ సాధించిన 241* పరుగులు క్రికెట్ గురించి తెలిసిన ప్రతి అభిమానికి ఇప్పటికీ గుర్తే. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఎక్కవ భాగం హాఫ్ సైడ్ ఆడటం విశేషం. టెస్టుల్లో సచిన్ మొత్తం 51 సెంచరీలు సాధించాడు. ఇందులో 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో సచిన్ చేసిన 248* పరుగులు టెస్టుల్లో అత్యధిక స్కోరు. ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపై సచిన్ డబుల్ సెంచరీలు సాధించాడు.

వీరేంద్ర సెహ్వాగ్ (6 డబుల్ సెంచరీలు)
టీమిండియా డాషింగ్ ఓపెనర్గా వీరేంద్ర సెహ్వాగ్కు పేరు. తనదైన దూకుడు స్వభావంతో ఆడుతూ బౌలర్లను ఊచకోత కోస్తాడు. క్రీజులోకి వచ్చాడంటే ఇన్నింగ్స్ను బౌండరీ లేదా సిక్స్తో ప్రారంభించాల్సిందే. టెస్టుల్లో సెహ్వాగ్ 6 డబుల్ సెంచరీలు సాధించాడు. చెన్నై వేదికగా సఫారీలతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 319* పరుగులు సాధించాడు. తద్వారా భారత్ తరుపున టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దాయాది దేశమైన పాకిస్థాన్పై సెహ్వాగ్ మూడు డబుల్ సెంచరీలు సాధించడం విశేషం. శ్రీలంకపై రెండు, దక్షిణాఫ్రికాపై ఒకటి ఉన్నాయి. రెండు డబుల్ సెంచరీలను ట్రిపుల్ సెంచరీలుగా కూడా మలిచాడు. ఇందులో ఒకటి పాకిస్థాన్పై కాగా, మరొకటి దక్షిణాఫ్రికాపై కావడం విశేషం.

విరాట్ కోహ్లీ (6 డబుల్ సెంచరీలు)
మోడ్రన్ డే దిగ్గజ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు బాదుతున్నాడు. తన కెరీర్లో గత దిగ్గజ క్రికెటర్ల రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ టెస్టుల్లో 6 డబుల్ సెంచరీలు సాధించాడు. శ్రీలంకపై రెండు, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండిస్, న్యూజిలాండ్లపై తలో ఒక డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 243 పరుగులు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications