రిషబ్ పంత్
పెద్ద హిట్టర్గా పేరొందిన ఈ యువ క్రికెటర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మూడో టెస్టుతో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సిక్సు బాది తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు రిషబ్ పంత్. ఇక, ఈ సిరిస్లో ఆఖరి టెస్టులో పంత్ సెంచరీ బాది అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. తన సెంచరీలో పంత్ నాలుగు కళ్లు చెదిరే సిక్సులు బాదాడు. ఓవల్ వేదికగా జరిగిన ఈ టెస్టులో కేఎల్ రాహుల్తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. చివరి వరకు పోరాడిన టీమిండియా ఈ టెస్టులో ఓటమిపాలైంది. స్వదేశంలో వెస్టిండిస్తో జరగనున్న ఈ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పంత్ రాణిస్తే అతడికి తిరుగుండదు.
హనుమ విహారి
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన ఆఖరి టెస్టులో హనుమ విహారి అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా జరిగిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి... రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీయడంతో వెస్టిండిస్తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో సైతం చోటు దక్కించుకున్నాడు. వెస్టిండిస్ పర్యటనలో రాణిస్తే, ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆసీస్ పర్యటనకు సైతం విహారి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
పృథ్వీ షా
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా చివరి రెండు టెస్టుల కోసం ఎంపికే చేసిన జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకోలేకపోయాడు. అయితే, వెస్టిండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో పృథ్వీ షా అరంగేట్రానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 2017 నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పృథ్వీ షా నిలకడగా రాణిస్తున్నాడు. 56.72 సగటుతో 14 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 1,418 రన్స్ సాధించాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏడు సెంచరీలతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరుపున ఓపెనర్గా బరిలోకి దిగిన పృథ్వీ షా తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
మయాంక్ అగర్వాల్
ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో వెస్టిండిస్ పర్యటనకు ఎంపికయ్యాడు. వెస్టిండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కేఎల్ రాహుల్తో కలిసి ఓపెనింగ్కు మయాంక్, పృథ్వీలలో ఒకరు అరంగేట్రం చేయడం లాంఛనంగా కనిపిస్తోంది. మయాంక్, పృథ్వీ తమ ఆటతీరుతో భవిష్యత్ జట్టుపై ఆశలు రేపుతున్నారు. గత సీజన్లో అన్ని ఫార్మాట్లతో కలిపి మయాంక్ 2,141 పరుగులు చేశాడు. 43 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో అతడు 3372 పరుగులు చేశాడు. ప్రస్తుతం వెస్టిండిస్ జట్టుతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్ ప్రాక్టీస్ మ్యాచ్లోనూ 90 పరుగులతో రాణించాడు.