సఫారీ టూర్పై ముందు నుంచీ మాజీల హెచ్చరికలు
సన్నాహాక మ్యాచ్ ఆడి ఉంటే స్థానిక పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడేవారని, కానీ అలా జరగలేదని అంటున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీసేన సత్తా దక్షణాఫ్రికా పర్యటనలో తెలుస్తుందని టూర్ ప్రారంభానికి ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. అయితే కోహ్లీసేన మాజీల మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీని ఫలితమే ఇప్పుడు టెస్టు సిరిస్ను కోల్పోవడానికి కారణం అయింది. నిజానికి కేప్టౌన్, సెంచూరియన్ మ్యాచుల్లో భారత బౌలర్లు విజయవంతం అయినప్పటికీ, భారత బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదు. రెండు టెస్టుల్లో కూడా ఆతిథ్య దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్లకే కట్టడి చేశారు.
స్వల్ప లక్ష్యాలను చేధించలేకపోయిన భారత బ్యాట్స్మెన్
అయితే బ్యాట్స్మెన్ మాత్రం ఆ స్వల్ప లక్ష్యాలను కూడా చేధించలేకపోయారు. ముఖ్యంగా సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన తనను తానే ఓడించుకుంది. ఫీల్డింగ్లో తప్పిదాలు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఇచ్చిన క్యాచ్లను జారవిడవడం చేశారు. ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే అవసరం లేని పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్లు అయ్యారు. ఇక, పాండ్యా విషయానికి వస్తే నిర్లక్ష్యంతో పెవిలియన్ చేరారు. మరోవైపు సెంచూరియన్ టెస్టుకు ఫామ్లో ఉన్న భువనేశ్వర్ను తప్పించి ఇషాంత్ను తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసింది.
బౌలర్లు రాణించినా... బ్యాట్స్మెన్ విఫలం
భారత్ తరఫున కోహ్లీ (153), మురళీ విజయ్ (46), అశ్విన్ (38) మినహా ఎవరూ రాణించలేదు. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఒక్కడే 47 పరుగులు చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో కోహ్లీసేన చేసిన తప్పులు క్షమించరానివి. నిలకడకు మారుపేరైన పుజారా అనవసర పరుగు కోసం ప్రయత్నించి రెండు ఇన్నింగ్సుల్లో రనౌట్ అయ్యాడు. తద్వారా ఓ చెత్త రికార్డుని మూట గట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించి గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు.
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ల్లో పుజారా రనౌట్
రెండో ఇన్నింగ్స్లో పుజారా (19) పరుగులు చేసి రనౌటయ్యాడు. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్లోనూ రనౌటైన మొదటి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ఓపిక లేనట్టు ఆడటమే ఓటమికి ప్రధాన కారణం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన ఏకంగా ఐదు క్యాచ్లను నేలపాలు చేసింది. అందులో ఆమ్లావి రెండు, రబడవి రెండు, డుప్లెసిస్ది ఒకటి. వీటిల్లో ఎక్కువ భాగం కీపర్ పార్దీవ్ పటేల్ నేలపాలు చేశాడు. ఇలా రెండో టెస్టులో అన్ని విభాగాల్లో కోహ్లీసేన విఫలమైంది.
మూడో టెస్టుకు భారీ మార్పులు
జనవరి 24 నుంచి జోహెన్స్ బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే మూడో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుబెట్టుకుంటుందో లేదో చూడాలి. మూడో టెస్టులో పలు మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. రెండో టెస్టుకు దూరమైన భువీని మూడో టెస్టుకు తీసుకోవచ్చు. ఇక కీపర్గా పార్థివ్ బదులు వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ను ఎంచుకోవచ్చు. గాయం కారణంగా సాహా ఈ టెస్టు సిరిస్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ని కీపర్గా సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉన్నపళంగా అతడిని ఇండియా నుంచి దక్షిణాఫ్రికా వెళ్లాల్సిందిగా బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. మూడో టెస్టులో రోహిత్ శర్మ ఉంటాడనే దానిపై కూడా సందిగ్ధత నెలకొంది.