హైదరాబాద్: ఆసియా కప్ వేదిక మారింది. ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో వేదికను మార్చారు.
ముందస్తు ప్రణాళిక మేరకు వచ్చే సెప్టెంబర్లో టోర్నీ భారత్లో జరగాల్సి ఉంది. టోర్నమెంట్ వేదికను కచ్చితంగా మార్చాల్సిందేనని పాక్ పట్టు పట్టడం, భారత్లో ఆసియా కప్ జరిగితే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తాను ఆతిథ్యం ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పింది. దీంతో చేసేదేం లేక వేదిక మారుస్తున్నట్లు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తెలిపింది.
ఈ విషయాన్ని ఏసీసీ, పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ మంగళవారం ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ 13 నుంచి 28 మధ్య ఈ ద్వైవార్షిక సిరీస్ను నిర్వహించనున్నారు. కౌలాలంపూర్లో నిర్వహించిన సమావేశంలో ఏసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది ఆసియా కప్లో ఐసీసీ పూర్తి సభ్యదేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ తలపడనున్నాయి. ఆరో స్థానం కోసం యూఏఈ, హాంకాంగ్, నేపాల్, సింగపూర్, మలేసియా, ఒమన్ పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల ద్వారా ఆరో జట్టును ఎంపిక చేస్తారు. ఆసియా కప్ను నిర్వహించడం ఇది 14వ సారి.
ఈ టోర్నీని 12 సార్లు వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. 2016లో ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఆ టోర్నీ ఫైనల్లో టీమిండియాను బంగ్లాదేశ్ను ఓడించి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఇక, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్కు పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నిజానికి ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఏప్రిల్లో ప్రారంభం కావాల్సి ఉండగా.. దానిని డిసెంబర్కు మార్చారు.