తొలి అనధికార టెస్టు: హాఫ్ సెంచరీలతో మెరిసిన షా, విహారి


హైదరాబాద్: మౌంట్ మౌన్గానియా వేదికగా న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న అనధికార టెస్టులో ఇండియా-ఏకు శుభారంభం లభించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లో ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి (86: 150 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ జట్టు 340/5తో పటిష్ట స్థితిలో నిలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రహానే
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ పృథ్వీ షా (62: 88 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ మురళీ విజయ్ (28: 64 బంతుల్లో 4 ఫోర్లు) విఫలమయ్యాడు. జట్టు స్కోరు 111 పరుగుల వద్ద పృథ్వీ షా పెవిలియన్కు చేరాడు.

హనుమ విహారితో కలిసి మయాంక్ హాఫ్ సెంచరీ
అనంతరం క్రీజులోకి వచ్చిన హనుమ విహారితో కలిసి మయాంక్ అగర్వాల్ (65: 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం జట్టు స్కోరు 184 వద్ద మయాంక్ ఔటైగా.. ఆ తర్వాత వచ్చిన రహానే (12) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.

202 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
దీంతో భారత్ 202 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (79 నాటౌట్: 111 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్కి అజేయంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇండియా-ఏ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ అనధికార టెస్టు మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆడాల్సింది.

ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవని భారత్
బిజీ షెడ్యూల్ కారణంగా బీసీసీఐ ఆఖరి నిమిషంలో రోహిత్ శర్మకు ఈ న్యూజిలాండ్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించింది. గురువారం ఆస్ట్రేలియా పర్యటనకి బయల్దేరిన టీమిండియా నవంబర్ 21నుంచి ఆరంభమయ్యే మూడు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్ను కూడా గెలవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications