న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో ఐసీసీ వరల్డ్ టీ20లో కొత్త సమరానికి తెర లేవనుంది. వరుస విజయాలతో సెమీస్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ల మధ్య ఫిరోజ్షా కోట్లా మైదానంలో బుధవారం టోర్నీలో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ప్రతిష్టాత్మకం.
తొలిసారి వరల్డ్ టీ20 కప్ను గెలిచి తమ దిగ్గజ క్రికెటర్ మార్టిన్క్రోకు ఘనమైన నివాళి ఇవ్వాలని కివీస్ జట్టు భావిస్తుంటే, రెండోసారి వరల్డ్ కప్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒకసారి(2007) మాత్రమే సెమీఫైనల్ చేరగా, ఇంగ్లాండ్ 2010లో ప్రపంచ విజేతగా నిలిచింది.
ఈసారి తొలి మ్యాచ్లోనే టైటిల్ బరిలో హాట్ ఫేవరెట్గా దిగిన టీమ్ఇండియాకు షాకిచ్చిన న్యూజిలాండ్ వరుస మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్లను చిత్తుచేసి గ్రూపు-2 నుంచి అజేయంగా సెమీస్లోకి అడుగుపెట్టింది. మరోవైపు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా అద్భుతంగా రాణిస్తోంది.
ఈ క్రమంలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆసక్తికర విషయాలు:
1. వరల్డ్ టీ20లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ గెలుపోటముల రికార్డు 8-4గా ఉంది. 2008 నుంచి 2013 మధ్య కివీస్పై ఇంగ్లాండ్ వరుసగా ఆరు మ్యాచ్లు నెగ్గి రికార్డు సృష్టించింది. టీ20 ఫార్మాట్లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు (8) సాధించిన రెండో జట్టు ఇంగ్లాండ్ కాగా, ఓ జట్టు చేతిలో అత్యధికసార్లు (4) ఓడిన రెండో జట్టు కివీస్ కావడం విశేషం.
2. వరల్డీ టీ20లో ఇప్పటిదాకా న్యూజిలాండ్ ఆడిన మ్యాచ్ల వేదికల (నాగ్పూర్, ధర్మశాల, మొహాలీ, కోల్కతా) సంఖ్య నాలుగు. ఢిల్లీలో జరిగే సెమీస్ కివీస్కు ఐదో వేదిక కానుంది. మరోవైపు ఇంగ్లండ్ తన నాలుగు మ్యాచ్లను రెండు వేదికల్లో (ముంబై, ఢిల్లీ)నే ఆడింది. ఢిల్లీ వేదికపై ఆప్ఘనిస్థాన్, శ్రీలంకలను ఇంగ్లాండ్ ఓడించింది.
3. ఈ వరల్డ్ టీ20లో న్యూజిలాండ్ బౌలర్ల ఎకానమీ రేట్ 5.97గా నమోదైంది. సూపర్-10 దశలో మిగతా జట్లన్నింటిలోకి కివీస్ బౌలర్లదే అత్యుత్తమ ఎకానమీ రేట్ కావడం విశేషం. తర్వాతి స్థానంలో వెస్టిండీస్ (6.86) ఉంది.
4. బ్యాటింగ్ పరంగా చూస్తే 12.97 సగటుతో కివీస్దే అత్యుత్తమం. ఇక రన్రేట్ పరంగా 9.10తో ఇంగ్లండ్ అన్నిజట్లలోకి అత్యుత్తమంగా ఉంది. కానీ, బౌలర్ల ఎకానమీ రేట్లో 8.95తో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శనను నమోదుచేసింది.
5. ఈ టోర్నీలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ స్పిన్నర్లు 20 వికెట్లు తీశారు. ఇందులో మిచెల్ సాంట్నర్ ఖాతాలో 9, ఇష్ సోధీ ఖాతాలో 8 వికెట్లు ఉండడం విశేషం. తర్వాతి స్థానాల్లో ఆప్ఘనిస్థాన్ (15), భారత్ (12) స్పిన్నర్లున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్లంతా కలిసి 8 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు.
6. ఈ టోర్నీలో న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధి ఎకానమీ రేట్ 4.97గా ఉంది. టోర్నీలో ఇప్పటిదాకా కనీసం పది ఓవర్లు వేసిన బౌలర్లందరిలోకి ఇది రెండో అత్యుత్తమం. విండీస్ స్పిన్నర్ సులేమాన్ బెన్ మొదటిస్థానంలో ఉన్నాడు.
7. ఈ టోర్నీలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గుప్తిల్ 162.33గా నమోదైన స్ట్రయిక్ రేట్. టోర్నీలో ఇప్పటిదాకా కనీసం వంద పరుగులు చేసిన మొత్తం 17మంది బ్యాట్స్మెన్లో గప్టిల్ మూడోవాడు. అన్ని మ్యాచుల్లో కలిపి 77 బంతులెదుర్కొని 125 రన్స్ చేశాడు గప్టిల్.
8. ఈ టోర్నీలో 150 లేదా అంతకు పైగా స్ట్రయిర్ రేట్ సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు జోస్ బట్లర్ (151.85 స్ట్రయిక్రేట్తో 123 రన్స్), జో రూట్ (150 స్ట్రయిక్రేట్తో 168 రన్స్) పరుగులు చేశారు.
జట్లు:
ఇంగ్లండ్: జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జోరూట్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అదిల్ రషీద్, క్రిస్జోర్డాన్, డేవిడ్ విల్లే, లియామ్ ప్లంకెట్.
న్యూజిలాండ్: గప్టిల్, విలియమ్సన్(కెప్టెన్), మున్రో, అండర్సన్, టేలర్, ఇలియట్, రోంచి, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, మిచెల్ మెక్క్లీన్గన్.