
హైదరాబాద్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన వన్డే బౌలర్ ర్యాంకుల్లో టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రాతో కలిసి ఆప్ఘనిస్థాన్కు చెందిన స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ ఆటగాడు సక్లయిన్ ముస్తాక్ పేరిట ఉన్న 21 ఏళ్ల రికార్డుని రషీద్ ఖాన్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ వయసు 19 ఏళ్ల 152 రోజులు. జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరిస్లో రషీద్ మొత్తం 16 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.
జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరిస్ను ఆప్ఘనిస్థాన్ 4-1తో కైవసం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన ఈ సిరిస్లో రషీద్ ఖాన్ రెండు ఇన్నింగ్స్ల్లో 51 పరుగులు చేశాడు. సోమవారం జరిగిన జింబాబ్వేతో జరిగిన ఫైనల్లో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో బౌలర్ల ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ఆల్ రౌండర్ల జాబితాలో టాప్-5లో రషీద్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అరంగేట్రం సీజన్లోనే 19 ఏళ్ల రషీద్ ఖాన్ తన బౌలింగ్తో అద్భుతాలు చేసి చూపించాడు. ఐపీఎల్లో రషీద్ ఖాన్ సన్ రైజర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రషీద్ ఖాన్ను రైట్ టు మ్యాచ్ ద్వారా రూ. 4 కోట్లకు దక్కించుకుంది. ఇక, కెరీర్లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్న టీమిండియా పేసర్ బుమ్రా విషయానికి వస్తే 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతమైన యార్కర్లతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్లను భయపెట్టగలడు. 2017లో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 49 వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే అగ్రస్థానంలో నిలిచిన వీరిద్దరూ ఇప్పటివరకు 37 వన్డేలాడటం.