
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో ఇంగ్లాండ్ ఎట్టకేలకు బోణి కొట్టింది. ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన ఇంగ్లాండ్.... ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (107) సెంచరీ సాధించగా.. మిచెల్ మార్ష్ (50), స్టోయినిస్ (60) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆస్ట్రేలియా మూడొందల పరుగుల మైలురాయిని చేరుకుంది.
అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 48.5 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (180) పరుగులతో ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 151 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 180 పరుగులు చేశాడు.
జట్టు స్కోరు 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా... జాసన్ రాయ్, జో రూట్ (91 నాటౌట్)తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 221 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఇన్నింగ్స్ 43 ఓవర్లో జాసన్ రాయ్ ఔట్ కావడంతో డబుల్ సెంచరీ చేసే అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు.
అయితే, ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా జాసన్ రాయ్ నిలిచాడు. గతంలో అలెక్స్ హేల్స్ (171) పేరిట ఉన్న రికార్డును జాసన్ రాయ్ ఈ వన్డేలో అధిగమించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా రాయ్దే కావడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.