
హైదరాబాద్: సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల బ్యాట్స్ ఉమెన్ తన అసాధారణ బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. క్రికెట్ను ఓ మతంలా భావించే భారత్లో మహిళా క్రికెట్పై కూడా ఆసక్తి పెరిగేలా చేసింది.
ఇంతకీ ఆ బ్యాట్స్ ఉమెన్ ఎవరని అనుకుంటున్నారా? మిథాలీ రాజ్. భారత్ తరపున మిథాలీ రాజ్ తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాదు..... అప్పటికి మహిళా టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోని ఘనతను అందుకుంది. అంతేనా భారత మహిళా జట్టుని రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్కు చేర్చింది.
మిథాలీ రాజ్ సాధించిన డబుల్ సెంచరీకి నేటితో సరిగ్గా 16 ఏళ్లు. ఈ డబుల్ సెంచరీని గుర్తు చేస్తూ మహిళా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 2002, ఆగస్టు 16న టాంటన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించింది.
అప్పటికి మిథాలీ వయసు 19 ఏళ్లు. దీంతో భారత్ తరపున తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్గా మొత్తంగా ఐదో క్రికెటర్గా గుర్తింపు పొందింది. మిథాలీ ఆడిన అద్భుతమైన ఈ ఇన్నింగ్స్ తర్వాతే భారత మహిళా క్రికెట్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మిథాలీ స్పూర్తితో ఎంతో మంది యువతులు క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నారు.
కాగా, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా పాకిస్థాన్కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది. 2004లో పాక్ మహిళా క్రికెటర్ కిరన్ బలూచ్ వెస్టిండిస్తో జరిగిన టెస్టులో 242 పరుగులు సాధించి మిథాలీ రికార్డును అధిగమించింది.