హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్తో చివరి 2 టెస్టులకు సెలక్టర్లు ప్రకటించిన జట్టులో విహారి, పృథ్వీ షాలకు జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. నాటింగ్ హామ్ టెస్టు అనంతరం బుధవారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది.
ఈ సమావేశంలో తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్పై సెలెక్టర్లు వేటువేశారు. విజయ్ తొలి టెస్టులో 20, 6.. రెండో టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లో డకౌటయ్యాడు. మరోవైపు, పేసర్లకు అనుకూలంగా ఉండే ఇంగ్లాండ్లో మూడో స్పిన్నర్ అవసరం లేదన్న ఉద్దేశంతో చైనామన్ కుల్దీప్ యాదవ్ను కూడా జట్టు నుంచి తప్పించారు.
వీరిద్దరి స్థానంలో విహారి, పృథ్వీ షాలకు ఎంపిక చేశారు. మంచి ఢిఫెన్స్, టెక్నిక్ కలిగిన కుడిచేతి వాటం విహారి ఇంగ్లాండ్ పరిస్థితులకు పనికొస్తాడని సెలెక్టర్లు భావించారు. ఇక, అదనపు బ్యాట్స్మెన్ అందుబాటులో ఉంటే నష్టం లేదన్న కారణంతో పృథ్వీ షాకు కూడా జట్టులో చోటు కల్పించారు.
టెస్టు జట్టులో పృథ్వీ షా ఎంపిక క్రికెట్ విశ్లేషకులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే, గత కొన్ని సంవత్సరాలుగా పృథ్వీ షా ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. పృథ్వీ షా సారథ్యంలోని యువ జట్టు భారత్కు అండర్-19 వరల్డ్ కప్ని అందించిన సంగతి తెలిసిందే.
పృథ్వీ షా గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు:
1. 2013లోనే 14 ఏళ్ల వయసులో పృథ్వీ షా వార్తల్లో నిలిచాడు. ముంబైలో అండర్-16 స్కూల్ టోర్నమెంట్లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరుపున 300 బంతుల్లో 546 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు 2012, 2013లో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్కు వరుసగా హారిస్ షీల్ట్ టైటిళ్లను అందించాడు.
2. గతేడాది రంజీ, దులీప్ ట్రోఫీలలో అరంగేట్ర మ్యాచ్ల్లోనే సెంచరీలు నమోదు చేసి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు.
3. 2016-17 రంజీ సీజన్లో తమిళనాడుతో జరిగిన సెమీ పైనల్ మ్యాచ్లో పృథ్వీ షా 120 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తమిళనాడుపై ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
4. గతేడాది దులిప్ ట్రోఫీలో సెంచరీ నమోదు చేసి అత్యంత పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టాడు. 2017-18 దులిప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూతో జరిగిన మ్యాచ్లో ఇండియా రెడ్ తరుపున ఆడిన పృథ్వీ షా సెంచరీ సాధించాడు.
5. తన మొదటి 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 5 సెంచరీలు నమోదు చేశాడు.
6. 2012లో మాంచెస్టర్లోని చెడ్లీ హుల్మీ స్కూల్ తరుపున ఇంగ్లాండ్లో ఆడేందుకు పృథ్వీ షాకు ఆహ్వానం అందించింది. సుమారు రెండు నెలల పాటు లండన్లోనే ఉన్న పృథ్వీ షా 1,446 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏడాది జులియన్ వుడ్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ జులియన్ వుడ్ పృథ్వీ షాకు ఉచిత ట్రైనింగ్ను ఆఫర్ చేశాడు. 2014లో యార్క్షైర్ ఈసీబీ కంట్రీ ప్రీమియర్ లీగ్లో పృథ్వీ షా క్లీత్రోపీస్ జట్టు తరుపున ఆడాడు.
7. ఈ ఏడాది పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టు ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా ఈ వరల్డ్ కప్ జరిగింది.
8. పృథ్వీ షా తన చిన్నతనంలో తన డైలీ నెట్ ప్రాక్టీస్ కోసం రెండు గంటల పాటు ప్రయాణం చేసేవాడు. పృథ్వీ షా కుటుంబం ముంబై శివారు ప్రాంతమైన విరార్లో ఉండేది. అక్కడి నుంచి తాను నెట్ ప్రాక్టీస్ చేసే చర్చిగేట్ వద్దకు రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. ఆ తర్వాత రాజకీయపార్టీ శివసేన సాయంతో తన కుటుంబాన్ని వెస్ట్ ముంబైలోని శాంతాక్రుయిజ్కు మారాడు.
9. ఐపీఎల్ 2018 కోసం ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో పృథ్వీ షాను ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు రూ. 1.2 కోట్లకు సొంతం చేసుకుంది.
10. జులై నెలలో ఇండియా ఏ తరుపున పృథ్వీ షా నాలుగు సెంచరీలు సాధించాడు. వెస్టిండిస్- ఏ జట్టుపై 102, ఆ తర్వాత లీసెస్టర్పై 132, దక్షిణాఫ్రికా-ఏపై 136, వెస్టిండిస్-ఏ జట్టుపై 188 పరుగులు సాధించాడు.