తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్లో
తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా మౌన్ తన బౌట్లో ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. గతంలో రెండుసార్లు ఈ మెగా ఈవెంట్లో కాంస్యాలు గెలిచిన 36 ఏళ్ల క్రుజ్తో జరిగిన బౌట్లో ఆరంభం నుంచే పంచ్ల వర్షం కురిపించింది. బౌట్ అనంతరం ఐదుగురు జడ్జీలు (29-28,30-27,30-26,29-28)స్కోరుతో ఏకగ్రీవంగా గెలిచినట్టు ప్రకటించారు.
ఇండియా ఓపెన్లో స్వర్ణం, పోలండ్ టోర్నీలో రజతం
ఈ ఏడాది జరిగిన ఇండియా ఓపెన్లో స్వర్ణం, పోలండ్ టోర్నీలో మనీషా రజతం సాధించింది. బౌట్ అనంతరం "ప్రపంచ చాంపియన్షిప్లో తలపడిన తొలి బౌట్లో విజయం సాధించడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నేను నా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తా. వచ్చే రౌండ్లలోనూ విజయం సాధిస్తా. తర్వాతి రౌండ్లో ప్రపంచ చాంపియన్తో తలపడతాను. తదుపరి రౌండ్లోనూ ఆమెను ఓడిస్తా" అని మనీషా చెప్పింది.
మరో బాక్సర్ సరితా దేవి టోర్నీలో శుభారంభం
క్వార్టర్స్ బెర్త్ కోసం ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దినా ఝోలమన్ (కజకిస్థాన్)తో మనీషా తలపడనుంది. మరో భారత బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ సరితా దేవి టోర్నీలో శుభారంభం చేసింది. 60 కిలోల లైట్ వెయిట్ కేటగిరిలో తొలిరౌండ్లో బై అందుకున్న 36 ఏళ్ల సరిత రెండోరౌండ్ బౌట్లో 4-0తో స్విట్జర్లాండ్ బాక్సర్ బ్రగర్ సాండ్రా డయానాను ఓడించింది.
ప్రీక్వార్టర్స్లో కెల్లీ హెర్రింగ్టన్తో తలపడనున్న సరితా దేవి
టోర్నీలో భాగంగా ప్రీక్వార్టర్స్లో కెల్లీ హెర్రింగ్టన్ (ఐర్లాండ్)తో సరితా దేవి పోటీపడనుంది. ఇదిలా ఉంటే, భారత్ నుంచి 2021 ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను ఉపసంహరించుకుంటామని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) హెచ్చరించింది. దిల్లీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్లో పాల్గొనేందుకు కోసొవో బాక్సర్ దొంజెతా సాదికుకు భారత ప్రభుత్వం వీసా నిరాకరించిన నేపథ్యంలో ఏఐబీఏ స్పందించింది.