
న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఆదివారం ఇండొనేసియాలోని లబువాన్ బజోలో 51 కేజీల విభాగం ఫైనల్లో మేరీ 5-0తో ఏప్రిల్ ఫ్రాంక్స్ (ఆస్ట్రేలియా )ను ఓడించింది. మూడు నెలల్లో ఆమెకిది రెండో స్వర్ణం. గత మేలో ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలోనూ మేరీ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో పాటు.. స్వర్ణం కైవసం చేసుకోవాలని మేరీ ధ్యేయంగా పెట్టుకుంది. గత మేలో థాయ్లాండ్లో జరిగిన ఆసియా చాంపియన్షిప్నకు దూరంగా ఉన్న మేరీ.. ప్రపంచ చాంపియన్షిప్నకు ముందు తన సత్తా చాటింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ప్రెసిడెంట్స్ కప్లో భారత్కు మరో ఆరు స్వర్ణ పతకాలు దక్కాయి. ఇతర ఫైనల్స్లో జమున బోరో (54 కేజీలు) 5-0తో గియులియా లమాగ్న (ఇటలీ)పై, సిమ్రన్జిత్ (60 కేజీలు) 5-0తో హసానా హుస్వతున్ (ఇండోనేసియా)పై, మోనిక (48 కేజీలు) 5-0తో ఎన్డాంగ్ (ఇండోనేసియా)పై విజయం సాధించి బంగారు పతకాలను దక్కించుకున్నారు.
పురుషుల విభాగంలో అంకుశ్ దహియా (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు) స్వర్ణాలు సాధించారు. అంకుశ్ 5-0తో కిన్ ఫాంగ్ (మకావు)ను, అనంత్ 5-0తో రహమాని రమిష్ (అఫ్గానిస్థాన్)ను, నీరజ్ 4-1తో మకాడో రామెల్ (ఫిలిప్పీన్స్)ను ఓడించారు. గౌరవ్ బిదూరి (56 కేజీలు), దినేశ్ దాగర్ (69 కేజీలు) మాత్రం రజతాలు సాధించారు. ఓవరాల్గా తొమ్మిది పతకాలు నెగ్గిన భారత్కు ఈ టోర్నీలో ఉత్తమ జట్టు అవార్డు లభించింది.
'ప్రెసిడెంట్స్ కప్లో స్వర్ణ పతకం సాధించా. భారత్ తరపున బరిలోకి దిగడం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది. ఇంకా బాక్సింగ్లో కొనసాగగలనని ఈ విజయం సూచిస్తోంది. మరింత శ్రమించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా. క్రీడల మంత్రి కిరణ్ రిజుజు, బాక్సింగ్ సమాఖ్య, సాయ్, నా కోచ్లు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు' అని మేరీకోమ్ అన్నారు.