టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2021లో బాక్సింగ్లో భారత్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పురుషుల 91 సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో భారీ అంచనాలు పెట్టుకున్న సతీశ్ కుమార్.. క్వార్టర్ ఫైనల్స్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ బాఖోదిర్ జలొలోవ్ చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ స్కోర్ చూడడానికి మరీ పేలవంగా ఉన్నా.. సతీశ్ పోరాటం అద్భుతం అనక మానదు. ఎందుకంటే ప్రీ క్వార్టర్స్ సమయంలో అతడి ముఖంపై భారీ గాయాలయ్యాయి. నుదుటి భాగం, గడ్డం దగ్గర మొత్తం 13 కుట్లు పడినా వెనక్కి తగ్గలేదు. అదేమీ లెక్క చేయకుండా క్వార్టర్స్లో పోటీపడ్డాడు.
కుట్లు పడినా సతీశ్ కుమార్ క్వార్టర్స్లో ఆడాడు. ఈ క్రమంలోనే ఓడిపోయాడు. ప్రస్తుతం సతీశ్ కాస్త నిరాశకు గురయ్యాడని, ఓటమి నుంచి తేరుకున్నాక అతడెంత గొప్ప పోరాటం చేశాడో అర్థం చేసుకుంటాడని ఇండియన్ బాక్సింగ్ హైపెర్ఫామెన్స్ డైరెక్టర్ సాంటియాగో నీవా ఓ జాతీయ మీడియాతో అన్నారు. అంతటి గాయాలతో ఆడటం తేలికైన విషయం కాదని, అది గర్వపడాల్సిన విషయమన్నారు. బాఖోదిర్ జలొలోవ్ కొట్టిన ప్రతి పంచ్ సతీశ్కు తీవ్రమైన నొప్పిని కలిగించిందని చెప్పారు. కఠిన పరిస్థితుల్లో ఆడటం సతీష్ ధైర్యం, దేశభక్తికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
సతీశ్ కుమార్ ఓటమితో టోక్యో ఒలింపిక్స్లో భారత బాక్సింగ్ పోరు దాదాపు ముగిసినట్టే. ఒక్క లవ్లీనా బొర్గోహెన్ మాత్రమే మహిళల 69 కేజీల విభాగంలో సెమీస్ చేరింది. దాంతో భారత్కు ఈ ఏడాది బాక్సింగ్లో ఒక పతకం సాధించే అవకాశం దక్కింది. మరోవైపు శనివారం 52 కేజీల పురుషుల విభాగంలో అమిత్ పంగాల్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు స్టార్ బాక్సర్ మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో, 75 కేజీల విభాగంలో పూజా రాణి, 60 కేజీల విభాగంలో సిమ్రన్జిత్ కౌర్ ఓడిపోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న వీరందరూ ఓటమిపాలవ్వడంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఆదివారం స్టార్ షట్లర్ పీవీ సింధు బ్రాంజ్ మెడల్ కోసం తలపడుతోంది. ఈ మ్యాచ్లో సింధు ప్రత్యర్థి చైనాకు చెందిన హి బింగ్జియావో. ఈ మ్యాచ్కు ముందు రికార్డు చూసుకుంటే చైనా ప్లేయర్దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 15సార్లు తలపడగా.. 9సార్లు బింగ్జియావో, 6సార్లు సింధు గెలిచింది. ఒకదశలో సింధుపై వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచింది. అయితే 2019 వరల్డ్ టూర్ ఫైనల్స్లో సింధు 21-19, 21-19తో బింగ్జియావోపై విజయం సాధించింది. ప్రస్తుతం సింధు 7వ ర్యాంక్లో, బింగ్జియావో 9వ ర్యాంక్లో ఉంది.