
అమన్ (జోర్డాన్): ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో సెమీస్కు చేరడంతో ఆమెకు టోక్యో బెర్తు ఖాయమైంది. సోమవారం జరిగిన పోరులో రెండో సీడ్ మేరీ కోమ్.. ఐరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీస్లో యూన్ చాంగ్ (చైనా)తో మేరీకోమ్ తలపడనుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీకోమ్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) కూడా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4-1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా.. 24 ఏళ్ల సిమ్రన్జిత్ 5-0తో రెండో సీడ్ నమున్ మోన్ఖోర్ (మంగోలియా)పై ఘన విజయం సాధించారు.
అమిత్ తొలిసారి ఒలింపిక్స్లో అడుగుపెట్టనున్నారు. సిమ్రన్జిత్ తొలిసారి ఒలింపిక్ బెర్త్ దక్కించుకోగా.. మేరీకోమ్ రెండోసారి ఒలింపిక్స్ బరిలో నిలువనుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ బెర్త్ దక్కించుకోవడంతో.. ఇదే వెయిట్ కేటగిరీలో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ మేరీకోమ్ ఓడిపోయుంటే.. మే నెలలో పారిస్లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో నిఖత్కు అవకాశం ఉండేది.
సోమవారమే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్ బౌట్స్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల విభాగం 63 కేజీల కేటగిరీలో మనీశ్ కౌశిక్ 2-3తో చిన్జోరింగ్ బాటర్సుక్ (మంగోలియా) చేతిలో.. మహిళల విభాగం 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 0-5తో ఇమ్ ఏజి (కొరియా) చేతిలో ఓడిపోయారు. మొత్తంగా ఈ టోర్నీ ద్వారా భారత్ నుంచి 8 మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. 2012 లండన్ విశ్వక్రీడలకు గరిష్ఠంగా 8 మంది బాక్సర్లు అర్హత సాధించగా.. ఈసారి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.