ఇండియా ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సీనియర్ బాక్సర్ మేరీకోమ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్స్ పోరులో మేరీ 4-1తో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (51 కిలోలు)ను ఓడించింది. ఆరంభంలో మేరీకోమ్పై నిఖత్ పైచేయి సాధించింది. ఈ సమయంలో ఆచితూచి ఆడిన మేరీ.. మూడో రౌండ్లో ఎదురుదాడికి దిగింది. దీంతో జడ్జీలు ఆమెనే విజేతగా ప్రకటించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఓడినా నిఖత్ జరీన్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పురుషుల 52 కేజీలు) 0-5తో అమిత్ పంఘల్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. లలితా ప్రసాద్ కూడా కాంస్య పతకం సాధించాడు. మొత్తంగా పురుషుల విభాగంలో 31 పతకాలు.. మహిళల విభాగంలో 26 పతకాలు భారత్కు ఖాయమయ్యాయి.
పురుషుల 52 కేజీల విభాగం సెమీస్లో సచిన్ సివాచ్ 5-0తో గౌరవ్ సోలంకిపై గెలిచాడు. దీంతో ఫైనల్లో అమిత్తో సచిన్ తలపడతాడు. పురుషుల 60 కేజీల విభాగంలో శివ థాపా (భారత్), మనీశ్ కౌశిక్ (భారత్) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు. పురుషుల 49 కేజీల విభాగంలో భారత బాక్సర్లు దీపక్, గోవింద్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించారు.
56 కేజీల విభాగం సెమీఫైనల్స్లో కవిందర్ బిష్త్ 4-1తో మదన్ లాల్ (భారత్)పై, చాట్చాయ్ డెచా (థాయ్లాండ్) 5-0తో గౌరవ్ బిధురి (భారత్) పై విజయం సాధించారు. వీరితో పాటు మరికొందరు భారత బాక్సర్లు కూడా ఫైనల్కు చేరారు.