
ఇంఫాల్: భారత మాజీ బాక్సర్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నాంగోమ్ డింకో సింగ్ మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. డింకో సింగ్ వయసు 42. మణిపూర్కు చెందిన డింకో సింగ్ 2017లో లివర్ క్యాన్సర్ బారీన పడ్డారు. 2020లో ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సన్ (ఐఎల్బీఎస్) రేడియేషన్ థెరపీ చేయించుకున్న ఆయన కాస్త కోలుకున్నట్లే కనిపించారు. కానీ కొద్దిరోజులకే కరోనా వైరస్ సోకడం.. దాని నుంచి కోలుకున్నప్పటికి తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు.
డింకో సింగ్ మృతిపై ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్తో పాటు.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచిన మహిళ బాక్సర్ మేరీ కోమ్ తమ సంతాపం ప్రకటించారు. ట్విటర్లో అతనికి ఇద్దరు నివాళులర్పించారు. 'డింకో సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నా. అతని జీవితం, పోరాటం రాబోయే ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన కుటుంబంకు బలాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నా' అని విజేందర్ ట్వీట్ చేశాడు. 'మీరు దేశానికి నిజమైన హీరో. మీరు లేకున్నా.. మీ వారసత్వం మా మధ్య అలానే ఉంటుంది' అని మేరీ కోమ్ ట్వీట్ చేశారు.
బ్యాంకాక్ వేదికగా 1998లో జరిగిన ఏషియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా డింకో సింగ్ అందరి దృష్టిలో పడ్డారు. 16 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగం నుంచి దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చిన ఆటగాడిగా ఆయన నిలిచారు. 1998లో అర్జున అవార్డు పొందిన సింగ్.. 2013లో భారత అత్యున్నత నాలుగో పురస్కారం పద్మ శ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సింగ్కు వెళ్లని సింగ్ ఇండియన్ నేవీకి కూడా సేవలందించారు. అనారోగ్యం బారినపడక ముందు కోచ్గా కూడా చేశారు.