హైదరాబాద్: బల్గేరియా వేదికగా జరుగుతోన్న స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ వికాస్ క్రిష్ణన్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన వికాస్ క్రిష్ణన్ అనంతరం బెస్ట్ బాక్సర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ బాక్సింగ్ టోర్నీలో బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకున్న తొలి భారత బాక్సర్గా వికాస్ చరిత్ర సృష్టించాడు.
బల్గేరియా రాజధాని సోఫియా వేదికగా 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో 26 ఏళ్ల వికాస్ వరల్డ్ చాంపియన్స్ కాంస్య పతక విజేత ట్రో ఇస్లే(అమెరికా)పై గెలిచి స్వర్ణం సాధించాడు. గతేడాది ఏప్రిల్-మే నెలలో ఆసియా చాంపియన్షిప్స్లో కాంస్య పతకం సాధించిన తర్వాత వికాస్ నెగ్గిన తొలి పతకం ఇదే కావడం విశేషం.
మరో భారత బాక్సర్ అమిత్ పంగల్ కూడా 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఇక, మహిళల ఫైనల్స్లో 48 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన సెవదా అసెనోవా చేతిలో మేరీకోమ్ ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. తద్వారా వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించాలనుకున్న మేరీకోమ్కు ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది.
స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మొత్తం 11 పతకాలు సాధించింది. ఇందులో ఐదు పతకాలు పురుషులు సాధించగా, ఆరు పతకాల్ని మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరడం విశేషం.
రజత పతకాలు సాధించిన వారిలో మేరీ కోమ్ (48 కేజీలు), సీమా పూనియా (81 కేజీలు), గౌరవ్ సోలంకీ (52 కేజీలు) ఉండగా, కాంస్య పతకాలు సాధించిన వారిలో మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి(60 కేజీలు) , సవేతీ బోరా (75 కేజీలు), భాగ్యబాతి కచారీ (81 కేజీలు), సతీష్ కుమార్ (91 కేజీలు), మహమ్మద్ హుస్సముద్దీన్ (56 కేజీలు) ఉన్నారు.