హైదరాబాద్: జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన కేకే హరికృష్ణన్ రెండున్నర నెలలపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6-10 తేదీల మధ్య నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు.
ఈ పోటీలకు దేశంలోని నలుమూలల నుంచి సుమారు రెండు వేల మందికిపైగా కిక్ బాక్సర్లు పాల్గొన్నారు. ఈ పోటీల్లో కేరళలోని కొట్టాయంకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్ ఫైనల్స్కు చేరుకున్నాడు. దీంతో అతడు పతకం సాధించడం ఖాయమని అనుకున్నారంతా. ఫైనల్స్లో భాగంగా సెప్టెంబర్ 9న పోటీల్లో బాక్సింగ్ రింగ్లోనే అకస్మాత్తుగా కుప్పకూలాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన నిర్వాహాకులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హరికృష్ణన్ను పరీక్షించిన వైద్యులు మెదడుకు గాయమైందని, లోపల తీవ్ర రక్తస్రావం అయినట్లు నిర్ధారించారు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు మెదడులో గడ్డకట్టిన భాగాన్ని తొలగించారు.
మొదట్లో వెంటిలేటర్, లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లేకుండానే శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని రోజులైనా అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. దాదాపు రెండున్నర నెలలు హాస్పిటల్లో ఉండటంతో హరికృష్ణన్కు ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యాయి. దీంతో హరికృష్ణన్ కుటుంబ సభ్యులు అతన్ని కేరళ తీసుకెళ్లారు.
వాయికోంలోని ఇండో అమెరికన్ హాస్పిటల్లో చేర్పించగా.. గురువారం తుదిశ్వాస విడిచాడు. హరికృష్ణన్ను మరణాన్ని ఛత్తీస్గఢ్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ చైర్పర్సన్ చంగన్లాల్ మంద్రా ధృవీకరించారు. రాయ్పూర్లో ఉన్నప్పుడు అతడి కుటుంబానికి ఆసుపత్రి సమీపంలో వసతి కల్పించామని చెప్పారు. కాగా, యువ బాక్సర్ మరణం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.